టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా, లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం భీష్మ. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకుడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న వెంకీ రెండో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మీద కన్నేశాడు. దాదాపు ఏడాది పాటు కేవలం స్క్రిప్ట్ మీద పని చేసిన వెంకీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొంత కాలంగా నితిన్ సినిమాల్లో మిస్ అయిన ఎనర్జీని మరోసారి తెర మీద చూపించాడు. దిల్ సినిమా సమయంలో నితిన్ ఎంత యాక్టివ్గా, ఎనర్జిటిక్గా కనిపించాడో అదే రేంజ్లో మరోసారి నితిన్ ను ప్రజెంట్ చేశాడు.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వెంకీ, అదే స్థాయిలో పెన్ పవర్ చూపించాడు. ఛలో సినిమాలోనే అద్భుతమైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్న ఈ యువ దర్శకుడు, భీష్మలో మరింత పరిణతి కనబరిచాడు. అద్భుతమైన కథ కాకపోయినా తనదైన కథనం, డైలాగ్లతో సినిమాను హిట్ రేంజ్కు తీసుకెళ్లాడు. హీరో క్యారెక్టరైజేషన్తో పాటు మిగతా అన్ని పాత్రలను ఎంటర్టైనింగ్గా డిజైన్ చేసిన వెంకీ, సినిమా సక్సెస్లో మేజర్ రోల్ ప్లే చేశాడు.
భీష్మ టీజర్ దగ్గర నుంచే సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఆడియో, ట్రైలర్లు కూడా ఆకట్టుకోవటంతో సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు చిత్రయూనిట్. ప్రస్తుతం వస్తున్న టాక్ను బట్టి చూస్తుంటే వాళ్ల కాన్ఫిడెన్స్ నిజమైనట్టుగానే అనిపిస్తోంది. ఇప్పటికే సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటంతో వెంకీ రేంజ్ మరో మెట్టు పెరిగినట్టుగానే భావిస్తున్నారు. ఇప్పటికే మైత్రీ, యూవీ సంస్థలకు సినిమాలు చేసేందుకు అంగీకరించిన వెంకీ ఆ రెండు ప్రాజెక్ట్లు క్రేజీ స్టార్స్తోనే చేసే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా తరువాత వెంకీతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు కూడా క్యూ కడతారన్న రేంజ్లో ఉంది భీష్మ టాక్.