ఒకప్పుడు వరుస విజయాలతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకున్న ఓ యంగ్ హీరో, తరువాత కెరీర్లో పూర్తిగా గాడి తప్పాడు. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వం లో నిర్మాత రాధామోహన్ నిర్మిస్తున్న సినిమా ఒరేయ్ బుజ్జిగా. ఈ సినిమాను అవుట్ అండ్ రొమాంటిక్ ఫన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు.
మార్చి 25న విడుదలయ్యే ఈ సినిమాకు పబ్లిసిటీ విషయం లోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్ తరువాత తాజాగా ఓ సాంగ్ ను రిలీజ్ చేసారు. కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన.. అంటూ సాగే ఈ పాటను మెగాహీరో వరుణ్ తేజ్ ఆన్ లైన్ లో విడుదల చేసారు.
అనూప్ రూబెన్స్ అందించిన మెలోడీ స్వరాలకు రచయిత కె.కె. అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. అర్మాన్ మాలిక్, పి. మేఘన ఈ గీతాన్ని ఆలపించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడం విశేషం. ఈ పాటను అందమైన లొకేషన్లలో రాజ్తరుణ్, మాళవిక నాయర్ పై చిత్రీకరించారు.
ఈ ఫస్ట్ సింగిల్ విడుదలైన సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ `వరుణ్తేజ్ మా సినిమా మొదటి పాటను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఉగాది కానుకగా మార్చి 25న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మా బేనర్ లో తప్పకుండా ఒరేయ్ బుజ్జిగా.. మరో సూపర్హిట్ మూవీ అవుతుంది` అన్నారు.