టాలీవుడ్లో మాస్ యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుగు గోపిచంద్. తొలి వలపు సినిమాతో హీరోగా పరిచయం అయిన గోపి, కెరీర్ స్టార్టింగ్ లో కాస్త తడబడినా, తరువాత విలన్ గా టర్న్ అయి మంచి విజయాలు సాధించాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం, శోభన్ రూపొందించిన వర్షం సినిమాలు గోపిచంద్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. విలన్ గా సక్సెస్ అయిన తరువాత మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు గోపిచంద్. యజ్ఞం, రణం లాంటి సూపర్ హిట్స్ తో ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
కెరీర్ స్టార్టింగ్ నుంచి గోపిచంద్ ఒక్కడే ఇండస్ట్రీలో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అసలు హీరో ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు. ఆయనకున్న సినీ నేపథ్యం ఏంటి అన్నది చాలా తక్కువ మందికే తెలుసు. గోపిచంద్ తండ్రి ఒకప్పుడు స్టార్ డైరెక్టర్. విప్లవ భావాలున్న చిత్రాలను తెరకెక్కించి ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు టీ కృష్ణ తనయుడే ఈ మాస్ హీరో గోపిచంద్. 1976 లోనే మొనగాడు సినిమాతో పరిచయం అయిన టీ కృష్ణ తరువాత నేటి భారతం, దేవాలయం, వందే మాతరం, ప్రతిఘటన, రేపటి పౌరులు సినిమాలకు దర్శకత్వం వహించారు. పలు మలయాళ చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు.
కేవలం దర్శకుడి గానే కాదు ఈ తరం ఫిలింస్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి ఆ బ్యానర్ లో పలు చిత్రాలను నిర్మించాడు. ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన గోపిచంద్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంత కాలంగా వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న గోపిచంద్ ఇటీవల చాణక్య సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాతో అయిన గోపిచంద్ హిట్ ట్రాక్లో వస్తాడేమో చూడాలి.