విమానయాన సంస్థలతో సెలబ్రిటీలకు ఇబ్బందులు తప్పటం లేదు. తరచూ విమానాలు ఆలస్యమవ్వటం, క్యానిల్స్ అవ్వటం లాంటి సమస్యలతో పాటు లగేజ్లు ఆలస్యమవ్వటం, కొన్ని సార్లు మిస్ అవ్వటం లాంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. గతంలోనూ ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. తాజాగా ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మకు కూడా ఈ సమస్య ఎదురైంది. అంతేకాదు ఈ భామకు ఇలా జరగటం ఇలా తొలిసారిగా కాదు అందుకే ఆగ్రహంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది ఆ బ్యూటీ.
ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అందాల భామ కృతి కర్బంద. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తీన్ మార్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది కృతి. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ భామ సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత చేసిన ఒంగోలు గిత్త, బ్రూస్ లీ సినిమాలు కూడా కృతికి విజయాలు అందించలేకపోయాయి. దీంతో బాలీవుడ్ బాట పట్టింది ఈ భామ.
గత ఏడాది కృతి నటించిన బాలీవుడ్ మూవీ హౌస్ ఫుల్ 4 ఘన విజయం సాధించింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా కృతి ఎయిర్ ఇండియాను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. `ప్రియమైన ఎయిర్ ఇండియా నా లగేజ్ మరోసారి పోగొట్టినందుకు థ్యాంక్యూ. మీరు మీ సిబ్బందికి మరింత సంస్కారం నేర్పించాల్సిన అవసరం ఉందనుకుంటా` అంటూ ట్వీట్ చేసింది.
గతంలో ఎయిర్ ఇండియా కారణంగా తన లగేజ్ కోల్పోయిన కృతి, తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే ఎదురుకావటంతో ఫైర్ అవుతోంది. అయితే కృతి ట్వీట్ పై స్పందించిన ఎయిర్ ఇండియా ఆమెకు క్షమాపణలు తెలియజేసింది వివరాలు తెలియజేస్తూ సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చింది.
Dear @airindiain , thank u for losing my luggage, yet again. And maybe u need to teach your staff a thing or two about basic manners.
— kriti kharbanda (@kriti_official) February 21, 2020