వెండితెర అసమాన నటి శ్రీదేవి దివికెగసి రెండేళ్లు పూర్తిచేసుకుంది. ఆమె మరణం ఇప్పటికి ఓ కలగానే ఉంది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పటికీ శ్రీదేవి ఇక లేరన్న నిజాన్ని ఆమె కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. భర్త బోనీ కపూర్ శ్రీదేవిని తలుచుకుంటూ ఏడవని రోజంటూ లేదనే చెప్పాలి. రాష్ట్రం, దేశం అని కాకుండా ప్రపంచమంతటా ఉన్న ఎందరో అభిమానుల ఆదరణ పొందింది శ్రీదేవి. నాలుగో ఏటనే తమిళ సినిమాలో నటించింది శ్రీదేవి. ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా బాలనటిగా అనేక పాత్రలు పోషించింది.
ఆమె సినీ వినీలాకాశంలో ఓ ధృవతార. నటనతో భారతీయ సినీ ప్రపంచంలోనే తొలి మహిళా సూపర్స్టార్గా ఎదిగిన అరుదైన నటీమణి. పాతికేళ్ల క్రితమే తెలుగు చిత్రసీమను విడచి బాలీవుడ్లో స్థిరపడినా, తెలుగు ప్రేక్షకుడు ఆమెను మరిచిపోయింది లేదు. రెండు తరాల టాప్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుతో పాటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, కమల్, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్స్ సరసన నటించిన ఘనత శ్రీదేవికి దక్కింది. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోను శ్రీదేవి వ్యక్తితం చాలా మంచిదని అంటారు.
అయితే అతిలోక సుందరి జీవితంలోనూ ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఊహకందని ఓ అగాథాన్ని... ఓ కల్లోలాన్ని గుర్తు చేస్తాయి. అలాగే మగవాళ్ల విషయంలో తన నిర్ణయం ఎప్పుడూ తప్పే అయ్యిందని శ్రీదేవి బాధపడేది జాన్వీ కపూర్ చెప్పింది. దీంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, 1963 ఆగస్టు 13న శ్రీదేవి తమిళనాడులో జన్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు శ్రీదేవి వర్థంతి సందర్భంగా అభిమానులు శ్రీదేవిని తలుచుకుంటూ పోస్ట్లు పెడుతున్నారు.
ఆమె ఏ లోకంలో ఉన్నా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. మేనల్లుడు పెళ్లి కోసం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడి జుమైరా ఎమిరేట్స్ హోటల్లో ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి చనిపోయారు. అప్పటికి జాన్వి ‘ధడక్’ సినిమాలో నటిస్తున్నారు. జాన్వికి అది తొలి సినిమా. కూతురి సినిమాను చూడకుండానే వెళ్లిపోవడం బాధాకరం.