యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్లో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యతో మూడవ సినిమాకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్నా ఇప్పటికే చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ రోజు నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతోంది. రామోజీ ఫిల్మ్సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతోంది. ముందుగా యాక్షన్ సీన్లతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుందట.
ఈ సినిమా కు బాలయ్యకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల బాలయ్య సినిమాలు అంటే హీరోయిన్లను వెతకడం అందరికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. లెజెండ్ సినిమా నుంచి బాలయ్య పాత హీరోయిన్లనే వరుసగా రిపీట్ చేస్తున్నాడు. సోనాల్ చౌహాన్, రాధికా ఆఫ్టే, అంజలి, శ్రీయ, నయనతార వీళ్లే బాలయ్య పక్కన వరుసగా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు బోయపాటి సినిమా కోసం కూడా ఇదే కష్టాలు తప్పడం లేదట.
ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని పెట్టాలో వెతికి వెతికి చివరకు ఓ ఇద్దరు హీరోయిన్లను పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య సరసన అంజలిని హీరోయిన్ గా ఖరారు చేయగా మరో హీరోయిన్ కోసం శ్రియని సంప్రదిస్తున్నారు. వీళ్లు ఇద్దరు గతంలో బాలయ్య పక్కన నటించిన వాళ్లే. అంజలి ఇప్పటికే బాలయ్య పక్కన నటించేందుకు ఓకే చెప్పగా.. శ్రియ ఓకే చెపుతుందా ? లేదా ? అన్న డౌట్ ఉంది.
ఏదేమైనా బాలయ్య ఇప్పటికే ఆరు పదుల వయస్సుకు చేరువ అవ్వడంతో ఆయన పక్కన సెట్ అయ్యే హీరోయిన్ల కోసం బోయపాటి పడుతోన్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అందుకే పదే పదే పాత హీరోయిన్లనే రిపీట్ చేస్తున్నారు. వీళ్లు కూడా చాలా వరకు సూట్ అవ్వడం లేదు.