ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఒక రేంజ్లు సత్తా చాటిన చాలా మంది ముద్దుగుమ్మలు చాలా ఏళ్ల విరామం తరువాత తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నారు. తమతో పాటు నటించిన నటులు ఇంకా హీరోలుగా కొనసాగుతున్నా వారు మాత్రం సపోర్టింగ్ రోల్స్కు మారిపోయారు. అయితే గ్లామర్ విషయంలో ఈ జనరేషన్ భామలకు కూడా పోటి ఇస్తున్నారు సీనియర్లు. ఆంటీలైనా అందం మా సొంతమే అంటూ ప్రూవ్ చేసుకుంటున్నారు.
కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడ్డాక మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్తో కెమెరా ముందుకొస్తోన్నారు. అలా వస్తున్న వారిలో కొంత మంది ఎదో అలా బండి లాగేస్తుంటే, మరికొందరు మాత్రం సినిమాలకు సరికొత్త గ్లామర్ తీసుకువస్తున్నారు. ప్రస్తుతం దర్శకులే అలనాటి హీరోయిన్లను వెతికి పట్టుకుని పాత్రలు సృష్టించి చిత్రాల్లో నటించడానికి ఒప్పిస్తున్నారు. డిమాండ్వున్న సీనియర్ హీరోయిన్లను క్యారెక్టర్ రోల్స్ ఒప్పించటం కూడా కాస్త కష్టమైన పనే.
అలా ఒప్పుకున్న సీనియర్ హీరోయిన్లు -అందమైన తల్లులు, అక్కలు,వదినల పాత్రల్లో సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు. ఇటీవల ఒకే సీజన్లో రిలీజ్ అయిన మూడు సినిమాలతో ముగ్గురు సీనియర్లు రీ ఎంట్రీ ఇచ్చారు. మహేష్బాబు హీరోగా వచ్చిన సరిలేని నీకెవ్వరు చిత్రంలో లేడీ అమితాబ్గా జాతీయ అవార్డు అందుకున్న నటి విజయశాంతి కీ రోల్లో నటించారు. దాదాపు 13 ఏళ్ల తరువాత తెలుగు తెరపై ఆమె తళుక్కుమన్నారు. ఆ సినిమాలో ప్రొఫెసర్ భారతిగా తన స్టామినాను చూపించారు.
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో టబు రీ ఎంట్రీ ఇచ్చారు. కూలీ నెం 1 చిత్రంతో గ్లామర్ స్టార్గా ఎంట్రీ ఇచ్చిన టబు తరువాత బాలీవుడ్కు వెళ్లి అక్కడా స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అయితే రీ ఎంట్రీలో మాత్రం ఆమెకు అంత మంచి పాత్ర దక్కలేదు. అల వైకుంఠపురములో సినిమాలో టబుకు మంచి పాత్ర దక్కలేదు. అయితే నటనకు అవకాశం లేకపోయినా.. గ్లామర్ విషయంలో మాత్రం ఈ భామకు ఫుల్ మార్క్స్ పడ్డాయి.