ఐదవ తారీఖు సినిమాతో మొదట నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన శర్వానంద్, ఆ తరువాత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పించారు. అమ్మ చెప్పింది, ప్రస్థానం, గమ్యం సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎంతో ఆకట్టుకోవడంతో పాటు నటుడిగా ఆ పాత్రల్లో శర్వా కనబరిచిన సహజ నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ తరువాత నుండి వరుసగా పలు వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ తన పరంగా ముందుకు సాగుతున్న శర్వా, నేడు తన 35వ పుట్టిన రోజుని ఘనంగా జరుపుకుంటున్నారు. 

 

నేడు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీకారం సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేసారు సినిమా యూనిట్ సభ్యులు. గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచిన ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో శర్వాకు జోడిగా నటిస్తుండగా, యువ దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. యువరాజ్ కెమెరా మ్యాన్ గా పని చేస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

 

పల్లెటూరి నేపథ్యంలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ని కలగలిపి తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక టీజర్ లో ట్రాక్టర్ నడుపుతూ, లుంగీ కట్టుకుని పల్లెటూరి యువకుడిగా శర్వా అదరగొట్టే లుక్ లో దర్శనం ఇచ్చారు. దీనిని బట్టి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు ముగించి వేసవి కానుకగా ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్. ఇటీవల జానుతో కొంత నిరాశపరిచిన శర్వా, ఈ సినిమాతో ఎంతమేర సక్సెస్ ని అందుకుంటారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: