భాగీ, భాగీ 2 సిరీస్ తో మంచి హిట్స్ అందుకున్నాడు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్. భాగీ సీక్వెల్స్ తో ఆడియెన్స్ మంచి కిక్కుస్తున ఈ కండలవీరుడు మూడవ సీక్వెల్ తో ఇప్పుడు భాగీ 3 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఆహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించాడు. మార్చి 6న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు భారీగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యాక్షన్ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది.
భాగీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి థియేటర్లలో రిలీజైంది. భారత్లో 4500 థియేటర్లలో, ఓవర్సీస్లో 1100 థియేటర్లలో కలిపి ప్రపంచవ్యాప్తంగా 5600 థియేటర్లలో రిలీజైంది. ఇక వాసూళ్ల విషయానికి వస్తే.. భాగీ 1 చిత్రం తొలి రోజున రూ.12 కోట్లు వసూలు చేస్తే.. భాగీ 2 చిత్రం రూ.25.10 కోట్లు రాబట్టింది. ఇక తాజాగా భాగీ 3 తొలి రోజు రూ. 17. 50 కోట్లు సాధించి.. తన్హాజీ రికార్డును బ్రేక్ చేసింది. తన్హాజీ మొదటిరోజు రూ. 15.10 కోట్లు వసూలు చేయగా భాగీ 3.. 17.50 కోట్లు సాధించింది. ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికించడంతో కొన్ని సినిమాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
అయితే అవేవీ పట్టించుకోకండా బరిలో దిగిన భాగీ3 పై కరోనా ప్రభావం ఎంతమాత్రం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ చిత్రంలో మరో ఆకర్షణ ఏంటంటే.. టైగర్ ష్రాఫ్ తన తండ్రి, వెటరన్ యాక్టర్ జాకీ ష్రాఫ్తో కలిసి మొదటి సారి నటించాడు. అది కూడా తండ్రి, కొడుకులుగానే నటించాడు. దీంతో జాకీ ష్రాఫ్ ఫ్యాన్స్కు ఈ సినిమా ఓ పండగలా మారిందనే సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. ఏదేమైనా మొదటి రోజు భాగీ 3 కలెక్షన్స్ పరంగా, టాక్ పరంగా బాగానే దూసుకుపోతోంది. మరి ముందు ముందు ఈ చిత్రం ఎంత వరకు రాబడుతుందో చూడాలి.