వెండితెర మీద తిరుగులేని స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నవారంతా అడపాదడపా రాజకీయాల వైపు చూసిన వారే. దీనికి సూపర్ స్టార్ లు, మెగాస్టార్ లు కూడా మినహాయింపేం కాదు. ఈ జనరేషన్లోనే కాదు గత జనరేషన్ టాప్ స్టార్ లు కూడా రాజకీయాల వైపు అడుగులు వేశారు. అయితే వీరిలో సక్సెస్ అయిన వారు మాత్రం చాలా తక్కువే. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు దాదాపు ఒకేసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే ఈ ఇద్దరినీ రాజకీయాల్లోకి తీసుకువచ్చిన నాయకుడు మాత్రం ఒకడే.
అమితాబ్ బచ్చన్ రాజకీయ అరంగేట్రానికి కారణం అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ. ఇందిరా గాంధీతో అమితాబ్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం కారణంగా వారి అమితాబ్, రాజీవ్ ల మధ్య కూడా మంచి స్నేహం ఉండేది. అదే చనువుతో రాజీవ్ ప్రధాని అయిన వెంటనే అమితాబ్ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానించాడు. రాజీవ్ ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చిన అమితాబ్ ఎక్కువ రోజులు ఆ రంగంలో ఇమడ లేకపోయాడు. తాను రాజకీయాలు చేయలేనంటూ కొద్ది రోజులకే పొలిటికల్ కెరీర్కు స్వస్థి పలికాడు.
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణను కూడా రాజకీయాల్లోకి ఆహ్వనించింది రాజీవే. ఎన్టీఆర్ 1984 ఎన్నికల్లో ఘనవిజయం సాదించటంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడింది. ఎన్టీఆర్ చరీష్మాను ఎదుర్కొన గలిగే సత్తా ఉన్న తెలుగు నేత కోసం ఎదురుచూసిన కాంగ్రెస్ నాయకులు ఆ స్థాయి లీడర్ రాజకీయాల్లో లేకపోవటంతో సినిమాల్లో ఎన్టీఆర్కు గట్టి పోటి ఇస్తున్న కృష్ణను రాజకీయాల్లోకి ఆహ్వానించాడు రాజీవ్ గాంథీ. రాజీవ్ కోరిక మేరకు రాజకీయా అరంగేట్రం చేసిన కృష్ణ కూడా ఎక్కువ కాలం రాజకీయాల్లో ఇమడలేకపోయాడు. దీంతో కొద్ది రోజులకే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి సినిమాల్లో బిజీ అయ్యాడు.