ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రధాన సమస్య కరోనా. దాదాపు 100 దేశాల్లో ఈ మహమ్మారి ప్రభావంతో జనజీవనం స్తంభించిపోయింది . ముఖ్యంగా చైనా, ఇటలీ దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. దాదాపు 4000 వేల మంది ప్రాణాలు విడిచారు.
మన దేశంలోనూ 59 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే జనం ఎక్కువగా గుమి గూడే ప్రాంతాల మీద ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో పలు సెలబ్రిటీ షోలు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. పాప్ దివా మడోనా కూడా కరోనా కారణంగా ఫ్రాన్స్ లో జరగాల్సిన రెండు షోస్ ను క్యాన్సిల్ చేసుకున్నట్టుగా వెల్లడించింది.
తాజాగా ఫ్రాన్స్ లో 1000 మందికి పైగా గుమిగూడే సభలు, సమావేశాలు లాంటి వాటి మీద బ్యాన్ విధించారు. దీంతో మడోనా షోస్ మీద కూడా ప్రభావం పడింది. తప్పని సరిపరిస్థితుల్లో తన రెండో షోస్ ను క్యాన్సిల్ చేసుకుంది మడోనా. మార్చి 10, 11 తేదిల్లో జరగాల్సిన కార్యక్రమం క్యాన్సిల్ కావటంతో ఇప్పటికే టికెట్లు కొన్నవారికి డబ్బు వాపసు చేస్తామంటూ నిర్వహకులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
గత డిసెంబర్ లో తొలిసారిగా చైనా లోని వుహాన్ నగరంలో తొలిసారిగా కరోనా వైరస్ ను గుర్తించారు. ఒకరి నుంచి ఒకరికి అతి వేగంగా సోకే ఈ వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇంత వరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ గాని, వైరస్ సోకిన వారికి ట్రీట్ మెంట్ చేసేందుకు శాస్త్రీయ పద్ధతులు గానీ ఇంతవరకు కనిపెట్టలేదు.