టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ పుణ్యమా అని ప్రభాస్, రానా, అనుష్క జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అనుష్క తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పటి వరకు అనుష్క నటించిన ఎన్నో సినిమాలో సూపర్ హిట్ గా నిలిచాయి. మొదట్లో గ్లామర్ పాత్రల్లో నటించిన అనుష్క కొంత కాలంగా నటన ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపిస్తుంది. అంతే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. భాగమతి సినిమా తర్వాత అనుష్క నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 2 న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఇక లీడర్ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన రానా దగ్గుబాటి విభిన్న పాత్రల్లో నటిస్తూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రానా నటించిన హాతీ మేరీ సాతీ ‘అరణ్య’ తమిళ వర్షన్ రిలీజ్ కూడా ఏప్రిల్ 2 కే ఉంది. అయితే ఈ ఇద్దరి సినిమాలకు కష్టాలు వచ్చాయని అంటున్నారు. జీఎస్టీ ఎఫెక్ట్తో తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు చిక్కులను ఎదుర్కొంటుంది. కేంద్రం ప్రవేశపెట్టిన 18 శాతం జిఎస్టీ కారణంగా సినీ పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుందని అంటున్నారు.
ఇప్పుడు జిఎస్టీ కాకుండా సినిమా వలన లాభమో, నష్టమో తెలుసుకోకుండా వచ్చిన ఆదాయంలో 10 శాతం టీడీఎస్ కట్టమనడం దారుణమని తమిళ సినిమా డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు, దర్శకుడు టీ రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 27 నుండి తమిళనాడులో ఎటువంటి కొత్త సినిమాలను విడుదల చేయమంటూ డిస్ట్రిబ్యూటర్ల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పటికే కేరళలో కరోనా ఎఫెక్ట్తో థియేటర్స్ని ఈ నెల 31వరకూ మూసి వేయడంతో.. మోలీవుడ్కి కూడా చిక్కులు తప్పేలా లేవు.