మణిరత్నం ప్రముఖ తమిళ చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన అలనాటి కథానాయక సుహాసిని మణిరత్నం భార్య. తెలుగులో ఈయన దర్శకత్వం వహించిన ఒకే ఒక సినిమా గీతాంజలి. కానీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అన్ని తమిళ చిత్రాలూ తెలుగులోకి అనువదించబడ్డాయి. నాయకుడు, రోజా, బొంబాయి, గీతాంజలి మొదలయినవి మణిరత్నం ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే. ఆయన ప్రతి చిత్రం విమర్శకుల ప్రశంశలు పొందింది. ఆయన సినిమా ఓ మ్యాజిక్‌. ప్రేక్షకులను కళ్లార్పకుండా చూసేలా చేయగలిగే మంత్ర దండమేదో ఆయన చేతిలో ఉంది. అందుకే ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా, దాదాపు అన్నీ బాక్సాఫీస్‌ వద్ద క్లాసిక్‌లుగా మిగిలాయి. వాటిలో చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో ఒకటిగా చెప్పగలిగే ‘బొంబాయి’ సినిమా 1995 మార్చి 10న విడుదలై ఇప్పటికి 25ఏళ్లు పూర్తి చేసుకుంది. 

 

కథ విషయానికి వస్తే శేఖర్‌(అరవింద స్వామి)ది ఆచారాలు, సంప్రదాయాలు పాటించే కుటుంబం. ముంబయిలో జర్నలిస్ట్‌గా పనిచేస్తుంటాడు. ఒకసారి ఊరు వచ్చిన అతను అనుకోకుండా ముస్లిం యువతి షైలా భాను(మనీషా కొయిరాలా)ను చూసి ఇష్టపడతాడు. తన ప్రేమను ఆమెకు వ్యక్తపరుస్తాడు. అయితే, మొదట ఆమె శేఖర్‌ను దూరంగా పెడుతుంది. అతని ప్రేమలో నిజాయతీని అర్థం చేసుకుని తనూ ప్రేమించటం మొదలు పెడుతుంది. ఈ విషయంలో ఇరువురి కుటుంబాల్లో తెలిసి గొడవ జరుగుతుంది. చివరకు షైలా భాను తను ప్రేమించిన శేఖర్‌ కోసం ఇల్లు విడిచి ముంబయి వెళ్లిపోతుంది. అక్కడ వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వారికిద్దరు పిల్లలు పుడతారు. ఈ నేపథ్యంలో ఇరువురి తల్లిదండ్రులకు కోపాలు తగ్గి శేఖర్‌, షైలా భానులను చూడటానికి ముంబయి వస్తారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ మత ఘర్షణలు చెలరేగుతాయి. వాటి వల్ల ఎంతమంది నష్టపోయారు. శేఖర్‌ కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి? చివరకు ఆ గొడవలు ఎలా సద్దుమణిగాయన్నది సినిమా కథ.

 

శేఖర్‌గా అరవిందస్వామి, షైలా భానుగా మనీషా కొయిరాలా చక్కగా నటించారు. వెండితెరపై వారి కెమిస్ట్రీ బాగా పండింది. ప్రేమికులుగా, భార్యాభర్తలుగా వారి జోడీ మెప్పించింది. నారాయణమూర్తిగా నాజర్‌, బషీర్‌గా కిట్టూలు కూడా అలరించారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తెలుగు నటుడు రాళ్లపల్లి గురించి. ట్రాన్స్‌జెండర్‌గా ఆయన నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా శేఖర్‌-షైలా భానుల కొడుకును కాపాడేందుకు ఆందోళనకారులపై ఆయన చేసే పోరాటం మెప్పిస్తుంది. చిన్నారుల నటన కూడా కొన్ని చోట్ల కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ సినిమాకి మరో ప్రధాన బలం ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం. ‘ఉరికే చిలకా..’, ‘కన్నానులే కలయికలు..’, ‘హమ్మా.. హమ్మా’ సాంగ్‌లు ఇప్పటికీ శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి. దర్శకుడిగా మణిరత్నం పేరు మార్మోగిపోయింది. 

 

మణిరత్నం ‘దొంగా దొంగా’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ముంబయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ అంశాన్ని తీసుకుని సినిమా తీయాలన్న ఆలోచన ఆయనకు వచ్చింది. ప్రముఖ మళయాళ రచయిత ఎం.టి వాసుదేవన్‌ నాయర్‌ను కథ, కథనాలను సిద్ధం చేయమని కోరారు. కానీ, అది ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు తానే కూర్చొని కథను సిద్ధం చేసుకుని ఓ తమిళ సినిమాగా చేయాలని అనుకున్నారు. తొలుత ఈ సినిమా కోసం విక్రమ్‌, మనీషా కొయిరాలాలకు ఫొటో షూట్‌ చేశారు. అయితే, అప్పటికే మరో చిత్రం కోసం గడ్డం, మీసం పెంచిన విక్రమ్‌ దాన్ని తొలగించేందుకు ఒప్పుకోలేదు. దీంతో ‘రోజా’లో చేసిన అరవిందస్వామిని తీసుకున్నారు. ఇక నాజర్‌ను నారాయణమూర్తి పాత్రకు,  రాజా కృష్ణమూర్తి(కిట్టు)ను బషీర్‌ పాత్రకు తీసుకున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా రాజీవ్‌ మేనన్‌ను ఎంపిక చేశారు. అరవిందస్వామి, మనీషా కొయిరాలాల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలను వర్షంలో తీయాలన్న ఆలోచన ఆయనదే. పొల్లాచి, కాసర్‌గోడ్‌, కన్నూర్‌ తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారు. ‘కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే’ పాటను ‘తిరుమల నాయక్కర్‌ మహల్‌’లో తీశారు. ఇక బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన వీడియోను ప్రసారం చేసేందుకు సెన్సార్‌బోర్డు ఒప్పుకోలేదు. దీంతో పత్రికలు, ఫొటోలను మాత్రమే చిత్రంలో చూపించారు. 

 

సెన్సార్‌ బోర్డు సభ్యులకు, మహారాష్ట్రలోని పలువురు కీలక రాజకీయనేతలకు సినిమా ప్రివ్యూ వేసి చూపించారు. అందరికీ సినిమా నచ్చింది. టినూ ఆనంద్‌ పాత్ర బాల్‌ ఠాక్రేలా పోలి ఉండటంతో కొన్ని సన్నివేశాలకు కత్తెరపడింది. దాంతో ఆ పాత్ర చాలా తక్కువ ఫ్రేమ్‌లో మాత్రమే కనిపిస్తుంది. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ కంపెనీ ఏబీసీఎల్‌ రూ.2.5కోట్లు చెల్లించి విడుదల హక్కులను సొంతం చేసుకుంది.  ‘బొంబాయి’ చిత్రాన్ని 1995 మార్చి 10న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. తొలినాళ్లలో హైదరాబాద్‌, హుబ్లీ, ధార్వాడ్‌, ఉత్తర కర్ణాటక సహా పలు చోట్ల నిరసనలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్‌లో థియేటర్లపై దాడి జరిగింది. తమ మనోభావాలను కించ పరిచేలా చిత్రం ఉందని ఓ వర్గం ఆరోపించింది. మణిరత్నం ఇంటిపై దాడులు కూడా జరిగాయి. కానీ అవేవీ మణిరత్నం మ్యాజిక్‌ ముందు పనిచేయలేదు. వరుసగా అందరూ సినిమా చూడటం మొదలు పెట్టారు. అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 

ఈ సినిమాను జాతీయ అవార్డు సహా అనేక అవార్డులు వరించాయి. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా నర్గీస్‌దత్‌ అవార్డును మణిరత్నం అందుకున్నారు. ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో సురేశ్‌కు జాతీయ అవార్డు వచ్చింది. రెండు ఫిల్మ్‌ ఫేర్‌లు, నాలుగు ఫిల్మ్‌ ఫేర్‌ సౌత్‌ అవార్డులు, మరాఠీ శ్రీ, రెండు తమిళనాడు స్టేట్‌ అవార్డుల సహా పలు అవార్డులు వచ్చాయి. ఎడిన్‌బర్గ్‌ ఇంటర్నేషల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గాలా అవార్డు వరించింది.  అమెరికాలో నిర్వహించిన పొలిటికల్‌ ఫిల్మ్‌ సొసైటీ అవార్డ్స్‌లో స్పెషల్‌ అవార్డు లభించింది. జెరూసలేం ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘విమ్‌ వాన్‌ లీర్‌ ఇన్‌ స్పిరిట్‌ ఫర్‌ ఫ్రీడమ్‌ అవార్డు’ను సైతం మణిరత్నం అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: