ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎవరినోట విన్నా కరోనా మాటే వినిపిస్తోంది. ఈ వైరస్ను డబ్ల్యూహెచ్వో మహమ్మారిగా ప్రకటించింది. ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ప్రస్తుతానికి మందులేని ఈ వైరస్ను అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచం స్తంభించిపోయినట్లు భావించాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఒకవైపు మందును కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు.. ఈ కరోనా వైరస్ కథాంశంగా సినిమా తీసేందుకు దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. తాజా పరిస్థితులను అనుకూలంగా మలచుకుని సినిమా తీసేందుకు ఇప్పటికే టైటిల్ను కూడా రిజిస్టర్ చేయించడం గమనార్హం.
చైనాలోని వుహాన్లో పుట్టి ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఈ కరోనా వైరస్ కథాంశాన్ని ఎలా తెరకెక్కిస్తారన్నది అందరిలో ఆసక్తినిరేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు నాలుగు వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు. లక్షలాదిమంది కొద్ది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇండియాలో కూడా కరోనా విజృంభిస్తుండడంతో జనం భయభ్రాంతులకి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడ దర్శకుడు ఉమేశ్ భనకర్ కరోనాలో ఓ కథాంశం చూశానని చెబుతూ , ఈ వైరస్పై సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా కోసం ‘డెడ్లీ కరోనా’ (భయంకరమైన కరోనా) అనే టైటిల్ను కూడా దర్శకుడు ఉమేశ్ రిజిస్టర్ చేయించడం గమనార్హం.
అంతేగాకుండా దీనిని ప్యాన్ ఇండియా సినిమాగా తీయాలని ఆయన భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కరోనా వైరస్ ఎక్కడ నుంచి వచ్చింది, ఎలా వ్యాప్తి చెందింది, దాని ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉంది? వంటి అంశాలను సినిమాలో చూపిస్తారట. అయితే.. గతంలోనూ వైరస్ సేపథ్యంలో సినిమాలు వచ్చాయి. ఇందులో ప్రధానంగా సూర్య హీరోగా సెవన్త్ సెన్స్ అనే చిత్రం వచ్చి మంచి హిట్ కొట్టింది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ మెడికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎన్నిసార్లుచూసినా మళ్లీమళ్లీ చూడాలని అనిపిస్తుంది.