ఇటీవల కాలం టెలివిజన్ రంగం కూడా ఓ రేంజ్ లో అభివృద్ధి చెందుతోంది. అందుకే స్టార్ హీరోలు కూడా బుల్లితెర మీద సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. చిన్న చిన్న హీరోలు కాదు ఏకంగా మెగాస్టార్ లు సూపర్ స్టార్ లు కూడా బుల్లితెర మీద సందడి చేశారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా బుల్లితెర మీద ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో యాంకర్ గా పరిచయం అయ్యాడు మెగాస్టార్.
హిందీలో అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరించిన సూపర్ హిట్ టెలివిజన్ షో కౌన్ బనేగా కరోడ్ పతి. కేవలం అమితాబ్ మాత్రమే ఈ షో చేయగలడు అనే స్థాయిలో సత్తా చాటాడు అమితాబ్. మై అమితాబ్ బచ్చన్ అంటూ బిగ్ బీ చెప్పిన మాటలకు టీ ఆర్ పీలు దాసోహం అన్నాయి. అందుకే దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ షోను ప్రారంభించారు. తెలుగులో ఈ షో తొలి సీజన్ కు కింగ్ నాగార్జున వ్యాఖ్యత గా వ్యవహరించాడు.
నాగార్జున హోస్ట్ చేసిన ఈ సిరీస్ టాలీవుడ్ లోనూ సూపర్ హిట్ అయ్యింది . అయితే సినిమా ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసిన మెగాస్టార్ ముందు గా ఈ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో చాలా కాలం తరువాత అభిమానులను పలకరించిన మెగాస్టార్ బుల్లితెర మీద మెప్పించ లేకపోయాడు. ఈ షో టీఆర్పీల పరంగానూ దారుణంగా నిరాశపరిచింది. దీంతో వెండితెర మీద రారాజుగా ఏలిన మెగాస్టార్ బుల్లితెర మీద మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. షోను ఎక్కువగా డ్రమాటిక్ గా నడపటంతో మెగాస్టార్ యాంకరింగ్ ఆకట్టుకోలేదన్న టాక్ వినిపించింది. దీంతో ఒక్క సీజన్ తోనే పూర్తిగా యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేశాడు మెగాస్టార్.