కరోనా మహమ్మారికి ప్రపంచమంతా వణికిపోతోంది. ఇప్పటికే పలు దేశాల్లో జనజీవనం స్తంభించింది. వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతుండటంతో ప్రజా జీవనం అతలాకుతలం అవుతోంది. ప్రజలు ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. ఈ ప్రభావం అన్ని రంగాల మీద కనిపిస్తోంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. గురువారం ఒక్క రోజు భారత్లో దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. ఈ నేపథ్యంలో వినోద పరిశ్రమ మీద కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది.
ఇప్పటికే కరోనా కారణంగా చాలా సినిమాల నిర్మాణాలకు బ్రేకులు పడ్డాయి. కేరళ, ఇటలీ, దుబాయ్ లాంటి దేశాల్లో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న నిర్మాతలు తమ సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. పలు ప్రాంతాల్లో థియేటర్లు కూడా మూసివేటంతో సినిమా రిలీజ్ ల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ స్థాయి సినిమాలకు మేజర్ మార్కెట్ ఉన్న చైనాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో హాలీవుడ్ సినిమాలు వాయిదా వేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా ఇండియన్ సినిమాల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇండియాలోనూ పలు నగరాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో థియేటర్లకు షాపింగ్ మాల్స్ మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ చిత్రాల రిలీజ్ లు వాయిదా వేస్తున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సూర్యవంశీ సినిమా అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అయ్యింది.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 24న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. కొత్త రిలీజ్ డేట్ను త్వరలో ప్రకటించనున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, కరణ్ జోహార్లతో కలిసి రోహిత్ శెట్టి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించింది.