కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 4000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు విడువగా దాదాపు లక్షా 30 వేల మంది చికిత్స పొందుతున్నారు. మన దేశంలోనూ దాదాపు 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా అధికారికంగా తెలుస్తోంది. అయితే ఇంకా గుర్తించని వారి సంఖ్య భారీగా ఉండొచ్చన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కరోనా ప్రభావం ఇతర రంగాల మీద కూడా కనిపిస్తోంది.
ఇప్పటికే స్టాక్ మార్కెట్ లు కుప్పకూలాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయణిస్తోంది. సినిమా రంగం మీద కూడా కరోనా ప్రభావం గట్టిగానే ఉంది. వివేశాల్లో జరగాల్సిన షూటింగ్లు వాయిదా పడుతున్నాయి. స్వదేశంలోనూ చాలా ప్రాంతాల్లో షూటింగ్ చేసేందుకు చిత్ర యూనిట్లు జంకుతున్నారు. దీంతో చాలా సినిమాల రిలీజ్లు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. జేమ్స్ బాండ్ సిరీస్లో భాగంగా రిలీజ్ అవుతున్న తాజా చిత్రం నో టైం టూ డై వాయిదా వేసినట్టుగా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా మరో అంతర్జాతీయ చిత్రం కూడా వాయిదా పడింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్లో భాగంగా రిలీజ్ అవుతున్న 9వ చిత్రం కూడా వాయిదా పడింది. ఈ ఏడాది మే 22న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఏకంగా ఏడాది ఆలస్యంగా 2021 ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు.
జస్టిన్ లిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విన్ డిసీల్, జస్టిన్ లిన్, క్లేటన్ టౌన్సెండ్, నీల్ హెచ్ మోరిట్జ్, సమంత విన్సెంట్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను యూనివర్సల్ పిక్చర్స్, వన్ రేస్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.