దాదాపు పదేళ్ల తరువాత అక్షయ్ కుమార్ కు జోడిగా నటించింది బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సూర్యవంశీ సినిమాలో మరోసారి కలిసి నటించారు అక్షయ్, క్యాట్. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన కెరీర్ స్టార్టింగ్ డేస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కత్రినా కైఫ్.
ఇటీవల సినిమా ప్రమోషన్ లో భాగం మీడియాతో మాట్లాడిన క్యాట్ `నేను అక్షయ్ కుమార్కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా కెరీర్ తొలినాళ్లలో ఓ సహ నటుడిగా ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. నేను కెమెరా ముందుకు వచ్చిన నిలబడ్డ ప్రతీ సారి ఆయన నా ముందు నిలుచొని నన్ను ఎంకరేజ్ చేసేవారు. ఆయన ఇచ్చే సలహాలు సూచనలు నటిగా నేను ఎదిగేందకు ఎంతో సాయ పడ్డాయి. నేను ఖచ్చితంగా చెప్పగలను నన్ను నమ్మిన అతి కొద్ది మంది నటుల్లో అక్షయ్ కూడా ఒకరు` అంటూ కామెంట్ చేసింది కత్రినా.
గతంలో అక్షయ్, కత్రినాలు హంకో దీవానా కర్ గయి, నమస్తే లండన్, వెల్ కం, సింగ్ ఈజ్ కింగ్, దే దనా దన్, బ్లూ సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరు చివరి సారిగా 2010లో తీస్ మార్ ఖాన్ సినిమాలో కలిసి నటించారు. ఇన్నేళ్ల తరువాత రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సూర్యవంశీ సినిమాలో మరోసారి కలిసి నటించారు. కాప్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రణవీర్ సింగ్, అజయ్ దేవగన్లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ముందుగా మార్చ్ 24న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వైరస్ ప్రభావం కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచిన చిత్రయూనిట్ పలు టెలివిజన్ షోలకు హాజరవుతూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు.