టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు, అతి త్వరలో తన ఫ్యామిలీతో కలిసి హిమాలయాలకు ప్రత్యేక టూర్ వెళ్లనున్నట్లు కొద్దిరోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఆ విషయాన్ని అటుంచితే, ఇప్పటికే తన తదుపరి సినిమాల విషయమై రెండు సినిమాలు లైన్లో పెట్టిన సూపర్ స్టార్, హిమాలయాల నుండి తిరిగి వచ్చిన తరువాత వాటిని మొదలెట్టనున్నారని అంటున్నారు. ముందుగా మెగాస్టార్, కొరటాల సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్న సూపర్ స్టార్ మహేష్, తొలిసారిగా చిరంజీవితో నటిస్తుండడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు మెగాస్టార్ కూడా మహేష్ తో కలిసి యాక్ట్ చేయనుండడం ఎంతో సంతోషముగా ఉందని, గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారితో తాను యాక్ట్ చేసానని, అయితే మళ్ళి ఎన్నో ఏళ్ల తరువాత ఆయన తనయుడు మహేష్ తో నటిస్తుండడం హ్యాపీ గా ఉందని మెగాస్టార్ కూడా అంటున్నారట. 

 

ఇక దీని తరువాత పరశురామ్ దర్శకత్వంలో తదుపరి సినిమా చేయనున్న మహేష్, ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారట. వాస్తవానికి వంశీ సినిమాలో ముందుగా మహేష్ నటించాల్సి ఉన్నప్పటికీ, ఆ సినిమా కథ పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో అది వెనక్కి వెళ్లి, ఆయన స్థానంలోకి పరశురామ్ రావడం జరిగింది. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి, వంశీ పైడిపల్లి సినిమాకు ముందుగా ఎస్ ఎస్ థమన్ ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలని భావించారట. 

 

అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే మరొక ఏడాదిన్నర వరకు థమన్ వరుసగా ఆఫర్లతో బిజీగా ఉండనున్నాడని, అందువల్ల ఆయన స్థానంలో మణిశర్మని తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. అదీకాక గతంలో మహేష్, మణిశర్మ కలయికలో సినిమా వచ్చి పదేళ్లు దాటిందని, ఇక ప్రస్తుతం మణిశర్మ కూడా మంచి ఫామ్ లో ఉండడంతో, తప్పకుండా వారి కాంబోలో రాబోతున్న ఈ సినిమా మంచి హిట్ కొట్టడం ఖాయం అని యూనిట్ భావిస్తోందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ఇది నిజంగా మహేష్ ఫ్యాన్స్ కి పండుగ వార్తే అని చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: