బాహుబలి రెండు సినిమాల సూపర్ హిట్స్ తో ఒక్కసారిగా బాలీవుడ్ హీరోల రేంజ్ ఫాలోయింగ్, క్రేజ్, మార్కెట్ ని సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్, ఆ తరువాత యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాలో ప్రభాస్, ఒక దొంగగా, ఆపై ఒక పెద్ద గ్యాంగ్ కు నాయకుడిగా రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం జరిగింది. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా, బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ లో సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. 

 

ఇక దాని తరువాత ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ జాన్. కొన్నేళ్ల క్రితం గోపిచంద్, రాశి ఖన్నా ల కలయికలో తెరకెక్కిన జిల్ సినిమాని తీసిన యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ జాన్ మూవీ లో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా, కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల హైదరాబాద్ లో ఒక పెద్ద షెడ్యూల్ ని జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ ని జరుపుకుంటోంది. 

 

ఇప్పటికే ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి భయబ్రాంతులకు గురిచేస్తుండడంతో పలువురు సినిమా నిర్మాణ సంస్థలవారు విదేశాల్లో తమ సినిమాల షూటింగ్స్ ని చేయడానికి భయపడుతుంటే, రెబల్ స్టార్ సహా జాన్ సినిమా యూనిట్ మొత్తం కూడా ఇటీవల జార్జియా వెళ్లి, ప్రస్తుతం అక్కడ ఎముకలు కొరికే 10 డిగ్రీల చలి, వాన లో కూడా షూటింగ్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో నిన్న ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు....!!     

మరింత సమాచారం తెలుసుకోండి: