అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చూస్తే చాలు అంటారు. ఈ సూత్రం సినిమా ఇండస్ట్రీలోనూ వర్కౌట్ అవుతుంది. మొదటి సినిమా తీసినపుడే దర్శకుడి తెలివి ఏంటనేది అర్థమై పోతుంది. ఇక రెండో సినిమా కూడా హిట్ అయితే ఇంకేంటి.. ఆ దర్శకుడికి అదృష్టం పరుగెత్తుకుంటూ వస్తుంది. ప్రస్తుతం భీష్మ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల పరిస్థితి అలాగే ఉంది.

 

నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో వచ్చిన చిత్రం భీష్మ. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లే కొల్లగొట్టింది. సేంద్రీయ వ్యవసాయం గురించి కమర్షియల్ పంథాలో ఎక్కడా బోర్ కలగకుండా చెప్పిన వెంకీ కుడుముల దర్శకత్వానికి అందరూ ఫిదా అయ్యారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి హీరోలు ఆ దర్శకుడి ప్రతిభని మెచ్చుకున్నారు.

 

అయితే ప్రస్తుతం ఈ దర్శకుడికి మంచి అవకాశం వచ్చిందని అంటున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కథ చెప్పే అవకాశం వచ్చిందని అంటున్నారు. మహేష్ బాబు లాంటి స్టార్ తో సినిమా చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అదీ కాకుండా అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసిన తర్వాత ప్రతీ డైరెక్టర్ తమకు కూడా ఛాన్స్ వస్తుందేమో అని ప్రతీ ఒక్కరూ చూస్తున్నారు.

 

ఇప్పటి వరకు హిట్ ఇచ్చిన ప్రతీ డైరెక్టర్ మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నారు. మహేష్ తో సినిమా చేయడానికి లైన్లో ఉన్నవారిలో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి ఉండగా ప్రస్తుతం వెంకీ కూడా చేరిపోయారు. మరి వీళ్ళందరిలో మహేష్ సినిమా ఎప్పటికి ఉంటుందో చూడాలి. మొత్తానికి ఒక్క దెబ్బతో వెంకీ కుడుముల మహేష్ దృష్టిలో పడిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: