ప్రస్తుతం అన్ని దేశాల ప్రజలను విపరీతంగా భయబ్రాంతులకు గురిచేస్తూ వణికిస్తోన్న మహమ్మారి కరోనా ప్రభావం వలన ప్రపంచంలోని దాదాపుగా అన్ని రంగాలు కూడా ఎన్నో ఇబ్బందుల్లో పడ్డాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పలు సినిమా పరిశ్రమలు సైతం తమ షూటింగ్స్ ని నిలిపివేయడంతో పాటు అన్ని చోట్ల థియేటర్స్ లో సినిమా ప్రదర్శనను కూడా పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసాయి. ఇక మరోవైపు వ్యాధి ప్రజల్లో మరింతగా ప్రభల కుండా ఉండేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా కొందరు ప్రముఖులతో వ్యాధి సోకకుండా ఉండేందుకు ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అనే దానిపై గట్టిగా దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే సచిన్ టెండూల్కర్, పివి సింధు తదితరులతో వీడియో ల ద్వారా ప్రజలకు జాగ్రత్తలు సూచించింది ప్రభుత్వం.
ఇకపోతే కాసేపటి క్రితం టాలీవుడ్ తరపున మెగాస్టార్ చిరంజీవి కరోనా రాకుండా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయమై ఒక వీడియో బైట్ ని రిలీజ్ చేసారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని, ముఖ్యంగా బయటకు వెళ్లడం, జన సమ్మర్ధంగా గుమికూడి ఉండడం వంటివి చేయవద్దని ఆయన అన్నారు. అలానే రోజులో వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులను సబ్బుతో కానీ లేదా శాంటినైజర్ తో కానీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అన్నారు.
ఇక మరీ ముఖ్యంగా దగ్గినప్పుడు, లేదా తుమ్మినప్పుడు చేతిలో కర్చీఫ్ కానీ లేదా టిష్యు కానీ అడ్డం పెట్టుకుని, ఆపై దానిని మూత ఉన్న చెత్త డబ్బాలో పడవేయాలని అన్నారు. మన ప్రక్క వారితో కరచాలనం చేయవద్దని, అలానే ముఖాన్ని, ముక్కుని, కళ్ళని అదేపనిగా చేతితో రుద్దవద్దని సూచించారు. ఈ విధంగా మనం అందరం ఈ కొద్దిపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే చాలావరకు వ్యాధిని నివారించచ్చని, అంతేకాని మాకు వ్యాధి రాదు, కాబట్టి పెద్దగా వీటిని పట్టించుకోనవసరం లేదు అనేటువంటి నిర్లక్ష్య ధోరణి మాత్రం అవలంబించవద్దని చిరంజీవి కోరారు....!!
A word of caution from Mega Star Chiranjeevi garu. Stay safe. #Covid19 #Covid19India pic.twitter.com/4Drg0NPvZ0
— Konidela Pro Company (@KonidelaPro) March 19, 2020