బాలీవుడ్ గాయని కనికా కపూర్కు కరోనా సోకినట్టుగా వార్తలు రావటం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల లండన్ నుంచి వచ్చిన ఆమె తరువాత పలువురు ప్రముఖులు పాల్గొన్న ఓ పార్టీలో పాల్గొంది. దీంతో ఇప్పుడు ఆమెతో కలిసి పార్టీకి హాజరైన వారంతా భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో యోగి సర్కార్ కనికా మీద చర్యలకు ఉపక్రమించింది. కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిపై ఆంక్షలు ఉన్నా అవేవి పట్టించుకోకుండా కనికా పార్టీలకు హాజరు కావటంపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఫైర్ అవుతున్నారు.
శుక్రవారం జరిగి ప్రభుత్వ సమావేశంలో కనికా కపూర్ మీద ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేయాలని నిర్ణయించారు. అందుకు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా అనుమతించినట్టుగా తెలుస్తోంది. ప్రజా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ ఆమె పై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భగా ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. `ఆమె లండన్ నుంచి తిరిగి వచ్చారు. ఆమెకు కరోనా సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి తెలుసు. అయినా ఆమె ఎయిర్ పోర్ట్ లో సరైన విధంగా టెన్స్ చేయించుకోలేదు. ఆమెకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నా నిర్లక్ష్యంగా ప్రముఖులు పాల్గోన్న పార్టీకి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆమె మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని నిర్ణయించాం` అని తెలిపారు.
కనికా పాల్గొన్న పార్టీలో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ కూడా పాల్గొన్నారు. అక్బర్ అహ్మద్ డంపీ పాల్గొన్న ఈ పార్టీలో ఉప ముఖ్యమంత్రులు దినేష్ శర్మ, కేశవ్ మౌర్య పలువురు కేబినెట్ మంత్రులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింథియా తో పాటు ఆమె కుమారుడు దుశ్యంత్ సింగ్ కూడా పాల్గొన్నారు.