మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్.. చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు వైష్ణవ్ తేజ్ సోదరుడు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో క్రితి శెట్టి హీరోయిన్. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా నీ కల్లు నీలి సముద్రం ... నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇక అసలు విషయానికి వస్తే... కుర్ర హీరో వైష్ణవ్ తేజ్... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సెంటిమెంట్ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే... తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయిన ఈ సినిమాతో అల్లు అర్జున్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. బన్నీకి అంతలా స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన ఆర్య సినిమాకు దర్శకుడు సుకుమార్.. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ‘ఆర్య’ చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేస్తే.. ‘ఉప్పెన’ చిత్రాన్ని ఆయన శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేశారు.
ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్ భావించింది. అయితే కరోనా వైరస్ ప్రభావంతో సినిమా విడుదల వాయిదా పడింది. లేటెస్ట్గా సినీ వర్గాల్లో వినపడుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని మే 7న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఆ రోజుకి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే !.. మే 7న అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఆర్య’ సినిమా విడుదలై బ్లాక్బస్టర్ హిట్ను సాధించింది. మరి బన్నీకి కలిసొచ్చిన రిలీజ్ డేట్.. వైష్ణవ్ తేజ్కి కలిసొస్తుందేమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.