చిరు, కొరటాల కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం పేరు `ఆచార్య`. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. ఎండోమెంట్ అధికారిగా చిరు ఇందులో కనిపించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై రామ్చరణ్తో కలిసి నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏ ముహూర్తంలో స్టార్ట్ చేశారో కానీ ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది. కెమెరామెన్, కారవాన్ల దగ్గరి నుంచి త్రిష వరకు వార్తల్లో నిలుస్తూనే వుంది.
తను సినిమా అంగీకరించినప్పుడు చెప్పిన దానికి ప్రస్తుతం చెబుతున్న దానికి ఎలాంటి పొంతన లేదని త్రిష హర్ట్ కావడం, సినిమా నుంచి తప్పుకోవడం గురించి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి రామ్చరణ్ అధికారిక నిర్మాత కాదని, పారితోషికం ప్లేస్లో లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారని, అందులో భాగంగానే సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా పేరు వేసుకుంటున్నారనే కొత్త ప్రచారం మొదలైంది. ఇలాంటి ప్రచారాల్ని మేకర్స్ పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ వార్తలపై మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్రెడ్డి క్లారిటీ ఇవ్వడం అనుమానాలకి తావిస్తోంది. ఈ చిత్రానికి తనతో పాటు రామ్చరణ్ కూడా నిర్మాతనే అని శనివారం ఆయన వెల్లడించారు.
ఈ చిత్రానికి కావాలనే కెమెరామెన్ను మార్చారని ప్రచారం జరిగిన స్పందించలేదు. ఆ తరువాత ఇందులోని కీలక అతిథి పాత్ర కోసం రామ్చరణ్ చేస్తున్నారని ఓసారి లేదు.. లేదు.. ఆ పాత్రలో మహేష్ కనిపించబోతున్నారని మరోసారి.. లేదు మహేష్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆ పాత్రని తిరిగి రామ్చరణ్ చేతే చేయిస్తున్నారని ప్రచారం జరిగినా చిత్ర వర్గాలు కానీ నిరంజన్రెడ్డి కానీ రామ్చరణ్ కానీ ఎటువంటి క్లారిటీనీ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. త్రిష సోషల్ మీడియా వేదికగా తను ఎందుకు ఈ టీమ్ నుంచి తప్పుకుంటున్నానో వెల్లడించినా వివరణ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఈ విషయం పై స్పందించడానికి అసలు కారణం ఏంటబ్బా?