ఈ జనరేషన్ యంగ్ హీరోల్లో వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్నా స్టార్ వారసుడు అక్కినేని నాగచైతన్య. కెరీర్ స్టార్టిగ్ లో కాస్త తప్పటడుగులు వేసినా.. తరువాత తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్కు తగ్గ కథలతో ఆకట్టుకుంటున్నాడు చైతూ. ఇటీవల మజిలీ సినిమాతో కెరీర్ బెస్ట్ సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం తన లవ్ స్టోరీని చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు.
హ్యాపీడేస్, లీడర్, ఫిదా సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత చైతూ చేయబోయే సినిమా పై ఇప్పటి నుంచే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్షన్ లో చైతన్య హీరోగా ఓ సినిమా ను ప్రకటించారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ బ్యానర్ రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మించనున్నారు. ఈ సినిమా బాలీవుడ్ మూవీ చిచోరేకు రీమేక్గా తెరెక్కుతుందని తెలుస్తోంది.
ఇప్పుడు చైతూ నెక్ట్స్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందట. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన మనం ఇండస్ట్రీ హిట్ నిలిచిన సంగతి తెలిసిందే. అక్కినేని కథానాయకులంతా కలిసి నటించిన మనం చరిత్ర సృష్టించింది. లాంగ్ గ్యాప్ తరువాత ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతున్నట్టుగా న్యూస్ రావటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కానీ మనం తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలేవీ సక్సెస్ కాలేదు. అఖిల్ హీరోగా తెరకెక్కించిన హలో ఫ్లాప్ కాగా ఇటీవల రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ జస్ట్ ఓకే అనిపించుకుంది. అందుకే మంచి ఫాంలో ఉన్న చైతూ, విక్రమ్ కుమార్ తో సినిమా చేయటం రిస్క్ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్న విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయట్ చేయాల్సిందే.