కరోనా దెబ్బకు అన్న ఇండస్ట్రీ ఆగిపోయాయి. ముఖ్యంగా వినోద రంగం మీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే అన్ని సినిమాల షూటింగ్ లు రిలీజ్ లు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. నటీనటులు సాంకేతిక నిపుణులు ఇంటికే పరిమిత మవుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇండస్ట్రీకి దారుణమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే వేల కోట్ల నష్టాలు వాటిళ్లినట్టుగా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
అయితే తన సినిమా విషయంలో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావొద్దని భావిస్తున్నాడు సల్మాన్. అందుకే వెంటనే లాక్ డౌన్ లోనూ సినిమా పనులు ప్రారంభించాడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం సల్మాన్, ప్రభుదేవా దర్శకత్వంలో రాథే : యువర్ మోస్ట్ వాటెండ్ భాయ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. సల్మాన్, దిశా పటానిల మీద ఒక్క పాటను మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్ సినిమా పనులు తిరిగి ప్రారంభించాడు.
ప్రభుత్వాలు వర్క్ ఫ్రమ్ హోం కు అనుమతివ్వడంతో రాథే సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభించాడు. తన పాన్వెల్ ఫాం హౌస్లో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించాడు. గత బుధవారం పాన్వెల్ కు చేరుకున్న సల్మాన్, కొంత మంది సెలెక్టివ్ టెక్నిషియన్స్ తో ఈ కార్యక్రమాలు ప్రారంభించాడు. ప్రస్తుతం ప్రభుదేవా చెన్నైలోనే ఉన్నాడు. కరోనా నేపథ్యంలో ఆయన ముంబై వెళ్లే పరిస్థితి లేకపోయినా ఫోన్ లోనే నిర్మాణానంతర కార్యక్రమాలను ప్రభుదేవా మానిటర్ చేస్తున్నాడట.
సల్మాన్ సరసన దిశ పటాని నటిస్తున్న ఈ సినిమాలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, భరత్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సల్మాన్ స్వయంగా సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రిలతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సాజిద్ వాజిద్, హిమేష్ రేష్మియా, తనిష్క్ బాగ్చిలు సంగీతమందిస్తున్నారు.