ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ తో అందరూ గడగడలాడిపోతున్నారు. సినీ కార్మికులెవ్వరికీ పని లేకపోగార ఈ వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగ్స్ అన్నీ కూడా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దినసరి వేతనంతో బతికే పేద కళాకారులు, టెక్నీషియన్స్ ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు డైరెక్టర్ వి.వి. వినాయక్ తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. నటుడు కాదంబరి కిరణ్కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోన్న 'మనం సైతంస అనే ఫౌండేషన్కు రూ. 5 లక్షలు అందజేశారు. నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న కొంత మంది పేద సినీ కళాకారులు, సాంకేతిక విభాగాల్లో పనిచేసే కార్మికులు మనం సైతంను సంప్రదించి, వాటిని పొందవచ్చని ఆయన తెలిపారు.
ఈ విషయాన్ని వినాయక్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈరోజు అందర్నీ వణికిస్తోన్న కరోనా వైరస్ను మన ఇళ్లల్లో మనం ఉండి వణికించాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలోని పేద కళాకారులు, టెక్నీషియన్లు, డాన్సర్లు, ఫైటర్లు.. ఎవరైనా కానివ్వండి.. నెల రోజుల పాటు షూటింగ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్లకు నిత్యావసర వస్తువులను అందజేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 లక్షల చెక్కును మనం సైతం కాదంబరి కిరణ్కుమార్కు అందజేస్తున్నా. నిజంగా ఎవరికి అవసరమో వారు కాదంబరి కిరణ్ గారిని సంప్రదించి, నిత్యావసర వస్తువులను తీసుకోవాల్సిందిగా కోరుతున్నా" అని చెప్పారు. నిరంతరం పేద సినీ కళాకారుల సంక్షేమం కోసం పరితపిస్తోన్న 'మనం సైతం' ఫౌండేషన్ను ఈ సందర్భంగా వినాయక్ ప్రశంసించారు. అందుకే ఆ ఫౌండేషన్ ద్వారా తన వంతుగా ఈ చిన్న సాయాన్ని చేస్తున్నానని ఆయన చెప్పారు.
మరి ఈ ఫౌండేషన్కి ఇంకెంతమంది వస్తారో చూద్దాం. చాలా మంది దీని కోసం ఎదురు చూస్తున్నారు. పాపం ఒక పూట గడవడం కూడా కష్టంగా ఉండే చాలా మంది దీని పై ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి దీనికి ఎవరికి తోచిన సహాయం వారు చేస్తే బావుంటుందని చాలా మంది భావిస్తుంటారు. దీనికోసం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు మంచి మనసు చేసుకుని ఇంకా ఎవరైనా వచ్చి ఈ పేద కళాకారులకు సహాయపడితే చాలా బావుంటుందని కొంత మంది ప్రముఖులు భావిస్తున్నారు.