పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు పవన్. దిల్ రాజు, బోనీ కపూర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కు వేణు శ్రీరామ్ దర్శకుడు. హిందీలో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ను పూర్తి చేశాడు పవన్. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతుండగా కరోనా కారణంగా ఈ సినిమాకు బ్రేక్ పడింది.
ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు పవన్. అయితే ఈ సినిమా కూడా ప్రస్తుతం ఆగిపోయింది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బంధిపోటు దొంగగా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. రాబిన్ హుడ్ తరహా పాత్ర కావటంతో పవన్ పొలిటికల్ కెరీర్ కూడా ఈ సినిమా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. పవన్ కెరీర్ లో తొలి పీరియాడిక్ డ్రామా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
క్రిష్ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే ఫిక్స్ చేశాడు పవన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో పవన్కు జోడిగా లావణ్య త్రిపాఠిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన లావణ్య కు కెరీర్లో ఇంత వరకు సరైన సక్సెస్ దక్కలేదు. దీంతో ఈ మూవీపై భారీ అంశాలే పెట్టుకుంది లావణ్య.