నిన్న తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని టాలీవుడ్ దిగ్గజ నటులు మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ సోషల్ మీడియా మాద్యమాలైన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో తన అఫీషియల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి ప్రజలతో తన అనుభవాలు పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇన్స్టా లో తన తల్లి అంజనమ్మతో కలిసి సరదాగా దిగిన ఫోటోని తొలిగా పోస్ట్ చేసిన మెగాస్టార్, తన అకౌంట్స్ కు అప్పుడే ప్రజలు, అభిమానుల నుండి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని అన్నారు.
ఇక నిన్నటి నుండి తన సోషల్ మీడియా ఎంట్రీ పై స్పందించిన పలువురు సినీ నటులకు అభినందనలు తెల్పుతున్న మెగాస్టార్, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా పై ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నారు. అందరం కలిసి ప్రధాని నరేంద్ర మోడీ సూచనలను తూచా తప్పకుండా పాటిస్తే తప్పకుండా అతి కొద్దిరోజుల్లో ఈ వ్యాధిని మనం తరిమి కొట్టవచ్చని మెగాస్టార్ సూచనలు చేశారు. ఇకపోతే నేడు మెగాస్టార్ చిరు బాట లోనే ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నడిచారు.
ఇప్పటివరకు సోషల్ మీడియా మాద్యమాలైన ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లలో మాత్రమే అఫీషియల్ అకౌంట్స్ ఓపెన్ చేసిన చరణ్, నేడు ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసారు. అయితే నేడు చరణ్ ట్విట్టర్ లో జాయిన్ అవడంతో పలువురు మెగాస్టార్ ఫ్యాన్స్ మరింత ఆనందాన్ని వ్యక్తం చేయగా, మెగాస్టార్ స్వయంగా ఈ విషయమై తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, సింహం వెంట సింహం పిల్ల కూడా నడుస్తోంది అంటూ సరదాగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఆ ట్వీట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. ఇక ఓ వైపు మెగాస్టార్, మరోవైపు మెగాపవర్ స్టార్ సోషల్ మీడియా ద్వారా మరింత యాక్టివ్ గా ఉండనుండడంతో మెగా ఫ్యాన్స్ లో వర్ణించనలవికాని ఆనందం వెల్లివిరుస్తోంది....!!
Welcome @AlwaysRamCharan to the twitter world. The cub follows the lion :)
— chiranjeevi konidela (@KChiruTweets) March 26, 2020