ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆమెకు పది రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్ తేలింది. అప్పటి నుంచీ ఆమె పేర్ హాట్ టాపిక్గా మారింది. అందుకు కారణం.. లండన్ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్ వచ్చిన కనికా కపూర్ హోటల్లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది. ఆమెను క్వారంటైన్లోకి పంపించారు. దాంతో పాటు ఆమెను కలిసిన వాళ్లను కూడా సెల్ఫ్ క్వారంటైన్లోకి పంపించారు.
మరోవైపు కరోనాపై ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటించకుండా.. కరోనా వచ్చిన తర్వాత కూడా పార్టీకి వచ్చినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. ఇదిలా ఉంటే.. వరుసగా నాలుగోసారి కూడా కరోనా టెస్టుల్లో పాజిటివ్ గా తేలిన సింగర్ కనికా కపూర్ ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్టును పెట్టింది. తాను ఐసీయూలో లేనని... తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపింది. తదుపరి పరీక్షలో తనకు నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నానని చెప్పింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వేచి చూస్తున్నానని తెలిపింది.
వారిని ఎంతగానో మిస్ అవుతున్నానని కనికా భావోద్వేగానికి గురైంది. కాగా, కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ నెల 20న కనికాను ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతుంది. గత పది రోజులుగా కనికా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దీంతో అంతా ఆందోళన చెందుతున్న్నారు. వరసగా నాలుగోసారి కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చింది. సాధారణంగా ఒకటి రెండు సార్లు పాజిటివ్ వచ్చిన తర్వాత కరోనా నెగిటివ్ అని వస్తుందని వైద్యులు అంటున్నారు. కానీ, కనికా కపూర్ విషయంలో ఇది జరగడం లేదు.