నందమూరి బాలకృష్ణ ఇటీవల వరుసగా తన సినిమాలతో అభిమానులను నిరాశపరుస్తున్నాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయిన ఎన్టీఆర్ బయోపిక్ లు కథా నాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా విఫలమయ్యాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా నటించిన బాలయ్య లుక్‌ పై కూడా అదే స్థాయిలో  విమర్శలు వచ్చాయి. ఈ సినిమాల కోసం తానే స్వయంగా నిర్మాతగా కూడా మారిన బాలకృష్ణ ఆర్థికంగానూ భారీ నష్టాలను చవిచూశాడు.

 

ఎన్టీఆర్‌ షాక్‌ తో షార్ట్ బ్రేక్ తీసుకున్న బాలయ్య తరువాత తమిళ దర్శకుడు కేయస్‌ రవి కుమార్ దర్శకత్వంలో మాస్ కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ లో నటించాడు. రూలర్ పేరుతో రూపొందిన ఈ సినిమా కూడా దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాలో బాలయ్య లుక్, సినిమా కథా కథనాలు కూడా అభిమానులను నిరాశపరిచాయి. దీంతో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ.

 

దీంతో మరోసారి గ్యాప్ తీసుకున్న బాలకృష్ణ, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఓ మల్టీ లాంగ్వేజ్‌ సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు బాలయ్యను సంప్రదించారు చిత్రయూనిట్. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ తలైవి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో నటించేందుకు బాలయ్య ను సంప్రదించారు చిత్రయూనిట్.

 

ఎన్టీఆర్‌ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన విష్ణు ఇందూరి ఈ సినిమాకు కూడా నిర్మాత కావటంతో బాలయ్య ఆ పాత్రకు ఒప్పుకుంటాడని భావించారు. కానీ బాలయ్య మాత్రం మరోసారి ఎన్టీఆర్ పాత్రలో నటించేందుకు నో చెప్పాడట. దీంతో మరో నటుడిని వెతికే పనిలోపడ్డారు తలైవి టీం.

మరింత సమాచారం తెలుసుకోండి: