పెళ్లి అంటే అందరూ ఉండాలి.. బంధు,మితృ సమూహంగా జరుపుకునే వేడుక పెళ్ళి. మరి అలాంటి వేడుకని ఎవ్వరూ లేకుండా చేసుకోవడం అనేది జరిగే పని కాదు తప్పి పరిస్థితుల్లో తప్పించి వాలయినంత వరకూ అందరూ కలిసి ఎంతో ఆనందంగా చేసుకుంటారు. బంధుమిత్రులు బంధాలు అనుబంధాలు అన్నిటికీ ఇదో వేదిక. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితిలో పెళ్లి చేసుకోవడం అంటే పెను ప్రమాదంతో పెట్టుకున్నట్టే. కోరి ముప్పు కొని తెచ్చుకున్నట్టే. ఇప్పటికే లాక్ డౌన్ నేపథ్యంలో 144 సెక్షన్ సరదా తీర్చేస్తోంది. కరోనా ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తక్కువే కదా.. ఈ మే – జూన్ లేదా జూలై వరకూ అయినా లైన్ క్లియరైతే పెళ్లి చేసుకుని హాయిగా దాంపత్యంలోకి అడుగు పెడదాం అనుకుంటున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతుళ్లకు పిడుగు పడ్డట్టు భూకంపంలో చిక్కుకున్నట్టు ఉంది సీన్.
మే జూన్ కాదు కదా ఈ ఏడాది అసలు పెళ్లిళ్లు జరిగేందుకు ఆస్కారం ఉందా? అంటే ఇప్పుడున్న సన్నివేశంలో సందేహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అంతంకతకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న వాళ్ల గుండెల్లో రాళ్లు వేస్తున్నాయి. ముహూర్తం పెడదామా వద్దా? పెళ్లికి బంధువుల్ని పిలుద్దామా వద్దా? అన్న మీమాంశ కొనసాగుతోంది. కరోనా మనుషుల మధ్య సామాజిక దూరాన్ని పెంచింది. అంటీ ముట్టనట్టు ఉండడం ఎలానో చాదస్తంగా ఎలా ఉండాలో నేర్పిస్తోంది. తాజా సన్నివేశం ప్రభావం ఇటు సామాన్య ప్రజలపైనే కాదు.. పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్న హీరోలు.. హీరోయిన్లు.. ఇతర సెలబ్రిటీలపైనా తీవ్రంగానే పడింది. అంతా సవ్యంగా ఉంటే ఈ ఏడాది పెళ్లి బంధంతో ఓ ఇంటి వాళ్లం కావాలనుకున్న నిఖిల్ .. నితిన్ లపైనా పిడుగులా పడింది కరోనా. ఇన్నాళ్లు బ్యాచిలర్లు.. ముదురు బెండ కాయలు అంటూ జోకులు వేసేవాళ్లకు సమాధానం చెప్పాలనుకున్న వీళ్ల కలలు కల్లలే అయిపోయాయి. నితిన్ – శాలిని జంట.. నిఖిల్ -డా.పల్లవి జంట ఒకటయ్యేందుకు ఇప్పట్లో ఛాయిస్ కనిపించకపోవడంతో వీళ్లు పెళ్లి ముహూర్తాన్ని రద్దు చేసి ఇప్పటికి వాయిదా వేసుకున్నారు.
ఇక గోవా లాంటి ఎగ్జోటిక్ లొకేషన్ లో చిలౌట్ పార్టీలు ప్లాన్ చేసినా కానీ అవన్నీ ఇప్పుడు అటకెక్కేసాయి. అయితే ఈ పరిస్థితి ఊహించనిది. ఈ ఏడాది కేవలం ఆ ఇద్దరు సెలబ్రిటీల పెళ్లిళ్లే కాదు.. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని పరిశ్రమల్లో పెళ్లిళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ లో ఏం ముచ్చటిస్తారు? అన్నది ఆసక్తిగా మారింది. పెళ్లి చేసుకోవడం అంటే అదో విందు వినోదం కాదు ఇప్పుడు.. కరోనా కరాళ నృత్యం. అన్నీ తెలిసీ బయోవార్ కి సహకరించినట్టేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆ ముహూర్తానికి జరిగిపోవాలి అనుకుంటే గనుక వారు కేవలం ఆ రెండు కుటుంబ సభ్యులు ముక్తసరిగా వివాహం జరిపించి మమా అనిపించుకోవాలే తప్పించి అదొక పెద్ద వేడుకలా చేసే టైమ్ మాత్రం ఇది కాదు.