క్రిష్ జాగర్లమూడి... దర్శకుడిగా బిజీగా ఉంటూనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంటారు. ఓ పక్క టీవీ సీరియళ్లు, ఇంకో పక్క వెబ్ సిరీస్లూ, మధ్యమధ్యలో కమర్షియల్ యాడ్లు కూడా తెరకెక్కిస్తుంటాడు. 'గమ్యం' సినిమా ద్వారా తన కంటూ ఒక గమ్యాన్ని ఏర్పరుచుకున్న దర్శకుడు. ఫస్ట్ సినిమాతోనే మంచి దర్శకుడిగా సినీ విమర్శకుల మన్ననలు పొందాడు. ఆ తర్వాత 'కృష్ణం వందే జగద్గురుమ్', 'వేదం' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కంచె' సినిమా ద్వారా ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతో స్టార్ డైరెక్టరుగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత తీసిన ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాల పరాజయం చెందడంతో తన ఇమేజ్ కొంచెం డామేజ్ అయిందనే చెప్పవచ్చు.
అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రాన్ని లైన్ లో పెట్టాడు. ఈ చిత్రానికి ఏ.ఎమ్. రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కనున్నది. ఈ గ్యాప్ లో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' కోసం కొన్ని వెబ్ సిరీస్ లు రూపొందిస్తున్నారు. అందులో ఒకటి స్ట్రీమింగ్ కూడా అవుతోంది. అంతేకాకుండా మూడు నాలుగు వెబ్ సిరీస్లు రూపొందించే బాధ్యతని క్రిష్ మీద వేశారట అల్లు అరవింద్. ఇప్పటికే పలు సీరియళ్లు, టీవీ యాడ్స్ తీసిన అనుభవం ఉన్న క్రిష్ ఇప్పుడు తాజాగా ఓటీటీ హాట్ స్టార్ కి కూడా ఒక వెబ్ సిరీస్ నిర్మించి ఇచ్చే పనిలో పడ్డాడట. ఈ మేరకు హాట్ స్టార్తో ఒప్పందం కూడా కుదిరిందని సమాచారం.
ఈ వెబ్ సిరీస్కి క్రిష్ కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నారట. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్ లో ఉన్న ఈ వెబ్ సిరీస్లో కొంతమంది టాలీవుడ్ స్టార్లు కూడా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. వెబ్ సిరీస్ లలో బోల్డ్ కంటెంట్దే పైచేయి, మరి దీన్ని క్రిష్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. హాట్ స్టార్ కోసం మరి క్రిష్ ఎలాంటి కథని చెప్పబోతున్నాడో చూడాలి. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీయబోయే సినిమా పెరియాడికల్ మూవీగా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్ అనుకుంటున్నారట. ఏదేమైనా ఈ సినిమాతో అయినా మళ్ళీ ఫార్మ్ లోకి రావాలని కసితో ఉన్నాడని తెలుస్తోంది.