డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తిరిగి ఫాంలో వచ్చాడు. ఇటీవల వరుస ఫ్లాప్లతో ఇబ్బందుల్లో పడ్డ పూరి, రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఘన విజయం సాధించటంతో మరోసారి స్టార్ హీరోలు కూడా పూరి పైపు చూస్తున్నారు. గతంలో చర్చల దశలోనే ఆగిపోయిన చాలా సినిమాలు ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చాయి.
ప్రస్తుతం పూరి, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమా తరువాత పూరి చేయబోయే సినిమా విషయంలో కూడా ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా పూరి దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. రీ ఎంట్రీలో ఓ పక్కా మాస్ సినిమా చేయాలని భావిస్తున్న చిరు అందుకు పూరి అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట. అందుకే గతంలో పూరితో చర్చలు జరిగి ఆపేసి ఆటో జానీ సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఆ కథ వర్క్ అవుట్ కాకపోయినా మరో కథతో అయినా సినిమా చేయాలని భావిస్తున్నాడట.
తాజాగా పూరి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చి పైసా వసూల్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినా పూరి, బాలయ్య ఇద్దరు మరో సినిమా చేసేందుకు రెడీ అంటూ ప్రకటించారు. అందుకే ఇప్పుడు ఆ కాంబోను సెట్స్ మీదకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఏ సినిమాను ముందుగా సెట్స్ మీదకు తీసుకువస్తారో చూడాలి.