త్రివిక్రమ్ శ్రీనివాస్ .. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రదర్శకులు ఎవరంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు. రచయితగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన త్రివిక్రమ్ అనతి కాలంలోనే మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సినిమాలో విషయం లేకున్నా కేవలం తన మాటలతోనే సినిమాను నిలబెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దర్శకుడిగా కూడా తన ప్రతిభ చూపించిన త్రివిక్రమ్ 'అతడు', అత్తారింటికి దారేది, జల్సా, అ ఆ, అరవింద్ సమేత వంటి విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.

 

సంక్రాంతి సీజన్లో రిలీజైన 'అల వైకుంఠపురంలో' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. అదే ఊపుతో జూనియర్ ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉండగా ప్రీ ప్రొడక్షన్ పనులు చక్కబెట్టే పనిలో ఉన్నారట చిత్ర బృందం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగ్ వాయిదా పడటంతో ఇప్పుడల్లా ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపించడంలేదు. దీంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సమ్మర్ కి వాయిదా పడే అవకాశం ఉంది.

 

సినిమా పూర్తయ్యే దాకా త్రివిక్రమ్ ఖాళీగా ఉండాలని భావించడం లేదంట. అందుకే ఈ గ్యాప్ లో ఒక సినిమా తీయాలని ఆలోచిస్తున్నాడట. ఇటీవల మలయాళ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రాన్ని చూసిన త్రివిక్రమ్ తెలుగు రీమేక్ కి డైరెక్షన్ చేయాలనీ అనుకున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈ చిత్ర రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారు. త్రివిక్రమ్ కి టైం గ్యాప్ దొరికితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందట. పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ మలయాళ సినిమా గురించి రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. మరి ఇదన్నా నిజమవుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: