టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆ తరువాత ఆర్య, బన్నీ, పరుగు వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకుని హీరోగా మంచి పేరు దక్కించుకున్నారు. ఇక అక్కడి నుండి మంచి అవకాశాలతో ముందుకు సాగి హీరోగా పలు విజయాలు అందుకున్న బన్నీ ప్రయాణం, ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో ఒకరుగా ఎదిగే స్థాయికి చేరింది. అయితే బన్నీ కెరీర్ లో సూపర్ సక్సెస్ సాధించిన సినిమాల్లో ఒకటైన బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా గురించి ఆయన ఫ్యాన్స్ ఒకింత ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు మంచి కమర్షియల్, మాస్ హంగులతో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ ని అందుకోవడంతో పాటు ఆ సినిమా హిందీ లో డబ్ కాబడి, యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ ని దక్కించుకోవడం జరిగింది. దాని తరువాత నే బన్నీ కి నార్త్ లో మంచి పేరు వచ్చింది అని చెప్పాలి. 

 

ఇకపోతే ఈ సినిమా గురించి నటుడు శివాజీ నిన్న ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తనకు ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ నటుల్లో అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం అని, ఇక ఆయన నటించిన సినిమాలు అన్ని కూడా దాదాపుగా థియేటర్ కు వెళ్లి మరీ చూస్తానని, ఇక సరైనోడు సినిమా అయితే ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదని అన్నారు శివాజీ. 

 

నిజంగా ఆ సినిమా చూసే సమయంలో కొన్ని సీన్స్ కి కలిగే థ్రిల్ అద్భుతం అని, ఇంకొన్ని సీన్స్ అయితే ఆడియన్స్ ని పూర్తిగా సీట్లకి కట్టిపడేస్తాయని, అందుకే ఆ సినిమా బన్నీ కెరీర్ మొత్తంలో ఎంతో స్పెషల్ అని అన్నారు శివాజీ. ఇక ఇటీవల అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురములో సినిమా చూడడానికి రెండు సార్లు వెళితే టికెట్స్ దొరకలేదని, నిజానికి తనకు తెలిసిన వారికి చెపితే టిక్కెట్స్ వస్తాయని, అయితే అలా కాకుండా స్వయంగా థియేటర్ కి తానే వెళ్లి టికెట్స్ కొనుక్కుని చూడాలని అనుకున్నానని అన్నారు. కాగా ఆ సినిమా రిలీజ్ అయి ఇప్పటికే చాలా రోజులు గడిచిందని, అతి త్వరలో ఎలాగైనా ఆ సినిమా చూస్తానని శివాజీ చెప్పుకొచ్చారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: