తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ కేరళ భామ 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ సినిమాల పరిశ్రమకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో, అనుపమకు తెలుగులో మంచి అవకాశం వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అ ఆ' సినిమాలో అనుపమ గడుసు పిల్లగా అద్భుతంగా నటించింది. ఆ తర్వాత ఈ అందాల భామ వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఆ మధ్య ఈ మలయాళీ భామ నటించిన సినిమాలు పెద్దగా అలరించలేకపోవడంతో కాస్త వెనకపడింది. ప్రస్తుతం ఈ అందాల భామ దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేస్తోంది. దిల్ రాజు మేనల్లుడు అశిష్ రెడ్డి హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రంలో అనుపమ హీరోయిన్గా చేసేందుకు ఒకే చెప్పింది.
'హుషారు' సినిమా తీసిన దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. ఈ సినిమాతో పాటు ఇంకో సినిమాలో అనుపమకు మంచి అవకాశం వచ్చింది. ఉమెన్ ఒరియెంటెడ్ కథతో రాబోతున్న ఈ సినిమాలో కథ మొత్తం అనుపమ చుట్టూనే తిరుగుతుందట. ఈ సినిమా ద్వారా హనుమాన్ చౌదరి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. గతంలో ఆయన రవిబాబు 'అవును' సినిమాకు సంబందించిన దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఈ సినిమా తమిళ తెలుగు భాషాల్లో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. కాగా అనుపమ తెలుగులో ఆఖరిసారిగా కనిపించిన చిత్రం 'రాక్షసుడు'. ఈ సినిమా మంచి విజయం సాధించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన ఈ సినిమాలో టీచర్ పాత్ర చేసిన అనుపమ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఎప్పుడూ క్యూట్ గా, సరదాగా ఉండే అనుపమ, ఈ ఉమెన్ ఒరియెంటెడ్ మూవీలో ఎలా కనిపించబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.