కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని వాళ్లు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు వారికి సాయం చేసేందుకు వివిధ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నా ఆకలి కేకలు మాత్రం ఆగడం లేదు. ఇక సినిమా, టీవీ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి ఉంది. షూటింగ్లు బంద్ కావడంతో పాటు.. థియేటర్స్ మూత పడటంతో వేల మంది సినీ కార్మికులు, కళాకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. వారిని ఆదుకునేందుకు ఇండస్ట్రీ ప్రముఖులు రంగంలోకి దిగి 'కరోనా క్రైసిస్ ఛారిటీ' ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పిస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, బాలయ్య.. ఇలా స్టార్ హీరోలతో పాటు యువ హీరోలు, దర్శకనిర్మాతలు తమకు చేతనైన సాయం చేస్తున్నారు. మరికొంతమంది స్వయంగా పేద కళాకారులకు, కార్మికులకు ఉచితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మందులు ఇచ్చి వారికి అండగా ఉంటున్నారు. కొంతమంది శానిటైజర్స్, మాస్కులను పంపిణీ చేస్తూ సేవాగుణాన్ని చాటుకుంటున్నారు.
ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, ఎంపీ గల్లా జయదేవ్ భార్య పద్మావతి గల్లా.. సినీ కార్మికుల సహాయార్థం కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.10 లక్షల విరాళం అందజేశారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై జయదేవ్ దంపతులు కుమారుడు అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా అమరరాజా ఇండస్ట్రీస్ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. తమ సంస్థ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సినిమాలను నిర్మిస్తామని పద్మావతి గతంలో చెప్పారు. కాగా, ఇప్పుడు ఛారిటీకి రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ.. ‘‘లాక్డౌన్ నేపథ్యంలో షూటింగ్లు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ నిత్యావసరాలను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న పేద సినీ కార్మికులను ఆదుకోవడానికి ఎంతోమంది సినీ పెద్దలు ముందుకు రావడం శుభ పరిణామం. ఆ మంచి పనిలో భాగం కావాలనే ఉద్దేశంతో సీసీసీకి తమ వంతుగా రూ. 10 లక్షలు అందజేస్తున్నాం. కరోనా మహమ్మారిపై పోరాటంలో అందరూ సమష్టిగా కృషి చేయాలి. తమ ఇళ్లల్లో ఉండటం ద్వారా క్షేమంగా ఉండాలి. అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేస్తూ మేం నిర్మిస్తోన్న చిత్రం షూటింగ్ లాక్డౌన్ కారణంగా నిలిచిపోయింది. పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్ కొనసాగిస్తాం’’ అని చెప్పారు.