అక్కినేని వారబ్బాయి అఖిల్ నిన్న ఘనంగా తన కుటుంబ సభ్యుల మధ్య 26 పుట్టినరోజుని జరుపుకున్నాడు. ముందుగా తన తండ్రి అక్కినేని నాగార్జున నటించిన సిసింద్రీ సినిమా తో చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టిన అఖిల్, ఆ తర్వాత పెరిగి పెద్దయ్యాక ఇటీవల విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మనం సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కొన్ని క్షణాలు కనిపిస్తారు. ఆ తర్వాత మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో హీరోగా అఖిల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే తొలి సినిమానే అఖిల్ కి ఘోరమైన చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక ఆ తర్వాత వెరైటీ సినిమాల దర్శకుడు విక్రమ్ కుమార్ తో హలో సినిమాలో నటించిన అఖిల్, ఆ సినిమాతో కూడా మరొక పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. 

 

ఆపై యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ మిస్టర్ మజ్ను లో నటించిన అఖిల్, ఆ సినిమాతో ఒకింత పర్వాలేదనిపించాడు. అయితే ఆయన చేసిన ఈ మూడు సినిమాలు కూడా అక్కినేని ఫ్యాన్స్ కి ఏమాత్రం సంతృప్తి కలిగించలేదు. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు సినిమా దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అఖిల్. వరుస విజయాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మంచి కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని రకాల అంశాలను కలగలిపి దర్శకుడు భాస్కర్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అఖిల్ నుండి సూపర్ హిట్ ఆశిస్తున్న తన ఫ్యాన్స్ కోరికని ఈ సినిమా తప్పకుండా తీరుస్తుందని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోందట. 

 

ఇక ఇటీవల రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ తోపాటు, మనసా మనసా పల్లవితో సాగె సాంగ్ కూడా ప్రేక్షకులు, అలానే ఫ్యాన్స్ నుండి మంచి స్పందనను రాబట్టి సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం, చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని లాకౌట్ అనంతరం మిగిలిన పార్ట్ షూట్ చేసి, వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారని, అలానే అఖిల్ కూడా తప్పకుండా ఈ సినిమాతో గట్టిగా హిట్ కొట్టి తీరతానని నమ్మకంగా ఉన్నారని అంటున్నారు. మరి ఈ సినిమా ద్వారా అఖిల్ ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్న నిజమైన హిట్ ఎంతవరకు లభిస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: