ప్రపంచాన్ని కరోనా మహమ్మారి చుట్టేసిన సమయంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వేళ.. అత్యవసర విభాగాల ఉద్యోగులు మాత్రం ప్రాణాలకు తెగించి, వైరస్తో పోరాడుతున్నారు. వైరస్ బారినపడిన వారికి చికిత్స అందిస్తూ నిజమైన హీరోలుగా నిలుస్తున్నారు వైద్యులు. నిరంతర పారిశుధ్య పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను కూడా ప్రజలు కొనియాడుతున్నారు. ఇదే సమయంలో రాత్రి అనక, పగలనకా విధులు నిర్వర్తిస్తూ లాక్డౌన్నుపకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్న పోలీసులకు సలాం చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో ప్రముఖ హీరో ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్.. ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషిని గుర్తించి స్వయంగా వారికి వీడియో కాల్ చేసి, వారి సేవలని ప్రోత్సహిస్తూ పాట పాడడం వైరల్ అవుతోంది.
ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మోహన్లాల్ వీడియో కాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజాతో పాటు 250 మంది ఆరోగ్య సిబ్బందితో మాట్లాడినట్లు తెలుస్తోంది. వారు చేస్తున్న పనులని ప్రశంసిస్తూ, వారిలో మరింత మనో ధైర్యాన్ని పెంచేందుకు ఓ పాటకూడా పాడారట. 1972లో విడుదలైన స్నేహ దీపమే మిళి తురక్కు చిత్రంలోని లోకం ముజువన్ సుఖం పకరనే స్నేహదీపమే మిజి తురక్కు అనే పాటను ఆయన స్వయంగా పాడి వినిపించారట. మోహన్ లాల్ స్వయంగా తమకి కాల్ చేసి అభినందించడంతో ఆరోగ్య సిబ్బంది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కట్టడికి మోహన్ లాల్ ఇటీవల భారీగా విరాళం కూడా ఇచ్చారు. రూ.50లక్షల రూపాయలని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఆయన అందించారు. ఇప్పుడు ఇదే దారిలోమరికొందరు హీరోలు కూడా నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వీరికి మోహన్లాల్ సరికొత్త పంథా చూపించారని చెప్పొచ్చు.