కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ అమలు కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులు, ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న వైద్యులు, నిరంతరం పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులే నిజమైన హీరోలంటూ జనం పొగుడుతున్నారు. ప్రధానంగా లాక్డౌన్ సజావుగా సాగేలా పోలీస్ వారు చేస్తున్న నిరంతర కృషిపై సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ హీరో మోహన్లాల్ స్వయంగా వైద్య సిబ్బందికి ఫోన్ చేసి పాట పాడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీసుల త్యాగాన్ని గుర్తించి వారికి హీరోలు నాగ చైతన్య, మహేష్ బాబు సెల్యూట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి .. పోలీస్ బిడ్డగా పోలీస్ వారికి సెల్యూట్ చేస్తున్నానని తన ట్విట్టర్ ద్వారా భావోద్వేగంతో పేర్కొన్నారు.
* రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరు అద్భుతంగా ఉంది. నిద్రాహారాలు మాని వాళ్ళు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్లో స్వయంగా చూస్తున్నాను. వారి పనితీరు వలన లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతోంది. అలా జరగబట్టే కరోనా వైరస్ విజృంభణ చాలా అదుపులోకి వచ్చింది. అలాగే సామాన్య జనం కూడా పోలీసులకి సహకరించాలి. కరోనాని అంతమొందించేందుకు వారికి చేదోడు వాదోడుగా మనం ఉండాలి. పోలీస్ వారు చేస్తున్న ఈ అమోఘమైన ప్రయత్నాన్ని పోలీస్ బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నాను* అని చిరంజీవి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. చిరు చేసిన ట్వీట్తో పోలీస్వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా అందరూ అండగా ఉండడం వల్ల తమలో ఆత్మస్థైర్యం మరింగా పెరుగుతుందని పోలీసులు అంటున్నారు. కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నారు.
#SalutingCoronaWarriors @TelanganaDGP @TelanganaCOPs #UnitedAgainstCorona pic.twitter.com/9LOFWD9irk
— chiranjeevi konidela (@KChiruTweets) April 10, 2020