మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తోన్న భారీ మల్టీస్టారర్ రణం రౌద్రం రుధిరం. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా 70శాతం మేర షూటింగ్ పూర్తైంది. కరోనా ఎఫెక్ట్ తో మిగిలిన షూటింగ్ వాయిదా పడడం తెలిసిన విషయమే. అయితే పక్కాగా షూటింగ్ జరిగితే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తోపాటు అలియా భట్ పాల్గొనే సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది.  

 

 

అయితే.. ఇటివల జరిపిన ఓ ఆన్ లైన్ మీడియా ఇంటరాక్షన్ లో అలియానే ఓ హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. ‘అలియా పాత్ర ఈ సినిమాకు చాలా కీలకం. ఇటువంటి పాత్రకు ఎవరని తీసుకోవాలనే నా అన్వేషణకు సమాధానంగా అలియా కనబడింది. కళ్లలో అమాయకత్వం ఆమె సొంతం. తన ఫేస్ లో ధీరత్వంతో పాటు అందం ఉంది. చరణ్ పాత్రకు సరిజోడు అలియానే అని అనిపించి ఆమెను తీసుకున్నాను’ అని క్లారిటీ ఇచ్చాడు. లాక్ డౌన్ పరిస్థితుల తర్వాత రామ్ చరణ్అలియా మధ్య సన్నివేశాలు తెరకెక్కిస్తాం అని చెప్పాడు.

 

 

అన్నీ సవ్యంగా జరిగినే ఈ ఏడాది జూలై 30న విడుదల కావాల్సిన ఈ సినిమా హీరోలిద్దరికీ గాయాలు కావటం.. మరికొన్ని అవాంతరాల వల్ల వాయిదా పడింది. 2021 జనవరి 8న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని యూనిట్ గతంలో ప్రకటించింది. ప్రస్తుత కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి కూడా వచ్చే పరిస్థితి కనపడటం లేదు. 2021 వేసవికి ఈ సినిమా రిలీజ్ కావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్, రాజమౌళి నుంచి మాత్రమే క్లారిటీ రావాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: