కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కరోనా ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ మీద బాగా పడిందని చెప్పాలి. ఎక్కడికక్కడ సినిమాలు, షూటింగ్లు, రిలీజ్లు అన్నీ ఆగిపోయాయి. దాంతో ఇటు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అల్లాడిపోతున్నారని చెప్పాలి.
లాక్ డౌన్ తో దేశం ఆర్ధికంగా ఎంతో దెబ్బతింటోంది. ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రపంచ దేశాలు సహా భారత్ లోనూ ఉద్యోగాల్లో భారీగా కోత తప్పడం లేదు. కంటికి కనిపించని ఓ వైరస్ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థనే అల్లకల్లోలం చేసింది. ఇప్పటికే లాక్ డౌన్ ఏప్రిల్ 14 నుంచి అదనంగా మరో 15 రోజులు పోడిగించే యోచన చేసింది ప్రభుత్వం ఏప్రిల్ 30వరకు కూడా ఈ లాక్డవున్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత దశల వారిగా లాక్ డౌన్ ఎత్తివేస్తారని అంటున్నారు. కానీ వైరస్ అదుపులోకి రాకపోతే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడే చెప్పలేం. మే ..జూన్ నెలల్లో కూడా లాక్ డౌన్ కొనసాగే అవకాశాలున్నా యని ఇప్పటికే ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే భారత్ అర్ధికంగా ఇప్పట్లో కోలుకోవడమనేది మాత్రం చాలా కష్టమేనని విశ్లేషిస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు.. జూన్..జూలైలో రీ ఓపెన్ చేసే అవకాశాలుంటాయని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అగ్ర నిర్మాత సురేష్ బాబు ప్రేక్షకుడి నెత్తిన వినోద భారం పడకుండా మార్నింగ్ షో..మ్యాట్నీలకు టిక్కెట్ ధరలో 50 శాతం డిస్కౌంట్ ని కొన్ని నెలలు పాటు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారుట. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు ఎలాగూ మూసి వేసారు కాబట్టి…తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటికి పన్ను మినిహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ముందుగానే అంచనా వేస్తున్న సురేష్ బాబు ప్రేక్షకుడి పై భారం పడకుండా ఆడియన్ థియేటర్ కు రావాలంటే ఇలాంటివన్ని చేయక తప్పదని భావిస్తున్నారట.
అయితే ఈ ప్రపోజల్ సురేష్ బాబుది మాత్రమే. దాన్ని మిగతా నిర్మాతలు అంగీకరిచాల్సి ఉంటుంది. డిస్కౌంట్ పై అంతా ఒకేతాటిపైకి వస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికే మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే సగటు ప్రేక్షకుడికి పెను భారంలా మారిన సంగతి తెలిసిందే. 150- 200 రూపాయాలు పెట్టి ఒక టిక్కెట్ కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. కుటుంబ సమేతంగా థియేటర్ కి వెళ్లాలంటే చాలానే ఊడుతుంది. ఇక తొలి వారంలో అగ్ర హీరోల చిత్రాల పేరుతో జరుగుతోన్న దోపిడి మాములుగా లేదు ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.