బాహుబలిలో శివగామిగా చేసిన రమ్యక్రిష్ణ పర్ ఫార్మెన్స్ కి ఫిదా కానీ వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో. కళ్లలో రాజసం, కంఠంలో గాంభీర్యం, నడకలో ఠీవి, చూపుల్లో పౌరుషం కలగలిపి ఉన్న ఆ పాత్రలో రమ్యక్రిష్ణ చక్కాగా ఒదిగిపోయింది. రమ్యక్రిష్ణ తన కెరీర్లో చాలా పాత్రలు చేసింది. ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. కానీ వాటన్నింటికీ ధీటుగా శివగామి పాత్రలో నటించింది.

 

అయితే శివగామి పాత్ర తర్వాత ఆమెకు వచ్చిన పాపులారిటీ తక్కువేం కాదు. ఆ పాపులారిటీని సరిగ్గా వినియోగించుకునేందుకు రమ్యక్రిష్ణ పాత్రలని ఆచితూచి ఎంచుకుంటుంది, ఏది పడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం ఆమె పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ చిత్రంలో నటిస్తుంది. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ చిత్రంలోనూ కనిపించనుంది.

 

 

అయితే ఇవే కాక మరో తెలుగు సినిమాలో ఆమె కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న హీరో నితిన్ తన తర్వాతి సినిమాగా బాలీవుడ్ అంధాధున్ ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఇందులో ఒకానొక పాత్ర కోసం రమ్యక్రిష్ణని అడుగుతున్నారట. అంధాధున్ లో టబు చేసిన పాత్రని తెలుగులో రమ్యక్రిష్ణతో చేయించాలని అనుకుంటున్నారట.

 

 

 

టబు పాత్ర కొంచెం గ్లామర్ తో కలగలుపుకుని నెగెటివ్ షేడ్స్ తో ఉంటుంది. మొదటగా ఈ పాత్రకి యాంకర్ అనసూయని తీసుకోవాలని అనుకున్నారు. కానీ నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఆ స్థానంలో మరో నటికోసం చూసారు. ఇప్పుడు రమ్యక్రిష్ణ అయితే సరిగ్గా సరిపోతుందని అంటున్నారు.
రమ్యక్రిష్ణ తన కెరీర్లో గ్లామర్ పాత్రలతో పాటు నెగెటివ్ పాత్రల్లోనూ కనిపించింది. కాబట్టి ఆమె ఈ పాత్రకి చక్కగా సరిపోతుందని అంటున్నారు. మరి రమ్యక్రిష్ణ ఈ పాత్రలో నటిస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: