కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించాయి. దీంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని వాళ్లు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు వారికి సాయం చేసేందుకు వివిధ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నా ఆకలి కేకలు మాత్రం ఆగడం లేదు. ఇక సినిమా, టీవీ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి ఉంది. షూటింగ్లు బంద్ కావడంతో పాటు.. థియేటర్స్ మూత పడటంతో వేల మంది సినీ కార్మికులు, కళాకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. వారిని ఆదుకునేందుకు ఇండస్ట్రీ ప్రముఖులు రంగంలోకి దిగి 'కరోనా క్రైసిస్ ఛారిటీ' ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పిస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, బాలయ్య.. ఇలా స్టార్ హీరోలతో పాటు యువ హీరోలు, దర్శకనిర్మాతలు తమకు చేతనైన సాయం చేస్తున్నారు. మరికొంతమంది స్వయంగా పేద కళాకారులకు, కార్మికులకు ఉచితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మందులు ఇచ్చి వారికి అండగా ఉంటున్నారు. కొంతమంది శానిటైజర్స్, మాస్కులను పంపిణీ చేస్తూ సేవాగుణాన్ని చాటుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా చలనచిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. కరోనా క్రైసిస్ చారిటీకి రూ. 5 లక్షలు విరాళం ప్రకటించింది.
View this post on InstagramWe'd like to contribute 5L to the #CoronaCrisisCharity Fund to support the daily wage movie workers who are the backbone of the movie industry. We really appreciate this initiative & would request the rest of the film fraternity to support this cause. #StayAtHome @chiranjeevikonidela @swapnacinema @vyjayanthimovies @swapnaduttchalasani @priyankacdutt
ఇదివరకే కరోనా మహమ్మారి పై పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు అందజేసిన సుప్రసిద్ధ చలనచిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తాజాగా కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి మరో రూ. 5 లక్షలు విరాళం ప్రకటించింది. ఫలితంగా ఇప్పటివరకు వైజయంతీ మూవీస్ అందజేసిన కరోనా విరాళం మొత్తం రూ. 25 లక్షలకు చేరుకుంది. చిత్ర పరిశ్రమకు వెన్నెముక అయిన రోజువారీ వేతనంతో పనిచేసే కార్మికులను ఆదుకోవడానికి సీసీసీకి రూ. 5 లక్షలు అందజేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా వైజయంతీ మూవీస్ సంస్థ ప్రకటించింది. సినీ కార్మికులను ఆదుకోవడానికి సీసీసీని ఏర్పాటు చేయడాన్ని తాము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామనీ, చిత్రసీమలోని మిగతా ప్రముఖులంతా ఈ మంచి పనికి తోడ్పాటునివ్వాలనీ కోరింది. ప్రజలందరూ తమ తమ ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలనీ, కరోనాపై రాజీలేని పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు అందరూ సహకరించాలనీ సంస్థ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా వైజయంతి మూవీస్ వారు ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - 'మహానటి' నాగ్ అశ్విన్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీకి ఏర్పాట్లు చేసుకుంటున్నది.