కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటికే అన్ని దేశాలకు విస్తరించిన ఈ వైరస్ వేల ప్రాణాలను బలితీసుకుంటోంది. వైరస్ భయంతో దాదాపు ప్రపంచమంతా లాక్ డౌన్ అయ్యింది. దీంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోజు వారి కూలీలకు పూట గడవని పరిస్థితి ఏర్పడింది. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సరిపోవటం లేదు. దీంతో అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
ముఖ్యంగా సినీ ప్రముఖులు తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. కొంత మంది డబ్బు రూపంలో కాకుండా నిత్యావమసరాలు అందజేయటం వారికి భోజన ఏర్పాట్లు చేయటం లాంటి సాయం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు ఈ తరహా సేవలు చేస్తుండగా బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా ఈ లిస్ట్లోకి వచ్చాడు.
తన వంతుగా 1000 కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు మున్నాబాయ్. `ఇది దేశమంతా కష్టకాలంలో ఉన్న సమయం. ప్రతీ ఒక్కరు తమ తొటి వారికి సాయం చేస్తున్నారు. మనం కూడా మన వంతుగా సోషల్ డిస్టాన్సింగ్ పాటించాలని కోరాడు. నేను నా వంతు కొన్ని కుటుంబాలకు సాయం చేయాలని చూస్తున్నాను` అని తెలిపాడు.