టాలీవుడ్ లో విప్లవ దర్శకుడు టి. కృష్ణ కుమారుడు గోపిచంద్ ‘తొలివలపు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో విలన్ అవతారం ఎత్తాడు. జయం, వర్షం, నిజం సినిమాల్లో ప్రతినాయకుడిగా తన సత్తా చాటాడు. తర్వాత మళ్ళీ హీరోగా నిలదొక్కుకున్నాడు. రణం, యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం సినిమాలతో మంచి విజయం అందుకున్నాడు. తెలుగు లో యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గోపిచంద్ లౌక్యం మూవీ తర్వాత వరుస అపజయాలు పొందారు. గత ఏడాది చాణక్య కాస్త పరవాలేదు అనిపించింది. నటుడు శ్రీకాంత్ సోదరి కూతురు రేష్మా ను వివాహం చేసుకున్నాడు.
గోపిచంద్ కుమారుడి పేరు విరాట్ కృష్ణ. సాధారణంగా సినీ పరిశ్రమలో కొంత మంది నటులు మంచి పాత్రలు కోల్పోవడం సహజం. కొంత మంది స్టార్ హీరోలు సూపర్ హిట్ సినిమాలు మిస్ కావడం సహజం..తాజాగా తన కెరీర్ లో మంచి పాత్ర మిస్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు గోపిచంద్. ప్రస్తుతం గోపిచంద్ ‘సీటీమార్’ మూవీలో నటిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో ఈ మూవీ కొనసాగుతుంది.. ఇందులో మొదటిసారిగా గోపిచంద్ సరసన తమన్నా నటిస్తుంది. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఒక్కడు మూవీలో విలన్ గా 'ఓబుల్ రెడ్డి' పాత్రలో ప్రకాశ్ రాజ్ అదరగొట్టేశాడు.ఈ మూవీతో మహేష్ బాబు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆ పాత్రకి ముందుగా గోపీచంద్ ను అనుకున్నారట.
అయితే అప్పటికే గోపీచంద్.. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'నిజం' సినిమాలో విలన్ పాత్రకి ఎంపిక అయ్యాడు. ఈ మూవీలో కూడా మహేష్ బాబు హీరోగా నటించిన విషయం తెలిసిందే. వెంట వెంటనే రెండు సినిమాల్లో ఈ కాంబినేషన్ అయితే బాగుండదని మహేశ్ బాబు వ్యక్తం చేయడంతో, ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నారు. 'ఒక్కడు' సినిమాలో గోపీచంద్ కి అవకాశం ఇవ్వలేకపోయామనే ఫీలింగ్ ఎమ్మెస్ రాజుకి ఉండేదట. అందువల్లనే ఆ తరువాత నిర్మించిన 'వర్షం' సినిమాలో విలిన్ గా గోపీచంద్ కి అవకాశం ఇచ్చారు.