కరోనా భయంతో సామాన్య ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో తాము ఏమి చేస్తున్నారో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కొందరు ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం తమకు తోచిన పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ షూటింగ్ లతో కుటుంబానికి దూరంగా ఉండే టాప్ స్టార్స్ ఇప్పుడు షూటింగ్ లకు బ్రేక్ పడటంతో ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని తమ కుటుంబం తో కలిసి సరదా గడిపేందుకు వినియోగించుకుంటున్నారు.
కరోనా వైరస్ భయాల మధ్య లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇటు కరోనా పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే.. అటు లాక్ డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని తన పిల్లలు మరియు భార్యతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. బేసికల్గా మహేష్ బాబుకు తన కుటుంబంతో గడపడమంటే మహా సరదా. ఆయన చేస్తున్న సినిమాల షూటింగ్ షెడ్యూల్స్లో కూడా ఏ మాత్రం బ్రేక్ వచ్చినా భార్యాపిల్లతో టూర్స్ వేస్తూ ప్రపంచాన్ని చుట్టి వస్తుంటారు. ఈ క్వారంటైన్ సమయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
మహేష్ తన పిల్లలతో గడిపే సరదా సమయాన్ని ఫోటోల రూపంలోనో లేదా వీడియోల్లోనో బంధించి నమ్రత తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ ఓ ఇంట్రస్టింగ్ వీడియోను పోస్ట్ చేశారు. మహేష్ తన ఇన్స్టాగ్రామ్లో.. తన కుమారుడు గౌతమ్ తో టీవీలో వర్చువల్ టెన్నిస్ ఆట ఆడుతున్న వీడియోను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ పోస్ట్ చేస్తూ.. “ప్రతి రోజు ఎక్కువగా ఇలాగే గడిచిపోతుంది. గేమ్ నైట్ విత్ గౌతమ్’ అని కామెంట్ జత చేసి పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన ఎవరైనా ఈ తండ్రీకొడుకులని చూసి ఆనందపడకుండా ఉండలేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.