ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులతో పాటు సౌత్ అండ్ నార్త్ సినీ పరిశ్రమలన్ని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. 'బాహుబలి' ఫ్రాంఛైజీ తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఉగాది పండగ సందర్భంగా మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు రాజమౌళి బృందం. 'ఆర్ ఆర్ ఆర్' అని ఇన్నాళ్ళు వర్కింగ్ టైటిల్ గా చెప్పుకుంటున్న ఈ సినిమాకి అఫీషియల్ గా 'రౌద్రం రణం రుధిరం' అనే పేరును ఖరారు చేశారు.
ఇక హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 'రైజ్ రోర్ రివోల్ట్' అనే పేరుని, తమిళంలో 'రథమ్ రణమ్ రౌథిరమ్', మలయాళంలో 'రుధిరమ్ రణమ్ రౌద్రమ్', కన్నడలో 'రౌద్ర రణ రుధిర' అనే టైటిల్స్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రామ్చరణ్ సరసన ఆలియాభట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవగణ్ ఓ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. ఇక రాం చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కూడా భారీ స్థాయిలో ఉంది. ఈ టీజర్ చూసిన అందరూ ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి మళ్ళీ కొత్త రికార్డ్ క్రియోట్ చేయడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు.
అయితే ఇప్పటికే ఈ సినిమా 75 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. లాక్ డౌన్ గనక లేకపోయి ఉంటే ఆ బ్యాలెన్స్ వర్క్ కూడా దాదాపుగా అయిపోయి ఉండేది. దాంతో ఈ సినిమా షూటింగ్ వర్క్ మొత్తం పెండింగ్ పడింది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో రాజమౌళి మిగతా షూటింగ్ ని కంప్లీట్ చేయడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేయిస్తున్నారట. ఈ సెట్ లోనే మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తారని తాజా సమాచారం. ఇక ఈ సినిమాని 2021 జనవరి 8 న రిలీజ్ చేయడానికి రాజమౌళి పకడ్భంధీగా సన్నాహాలు చేస్తున్నారట. ఎన్ని పుకార్లు వచ్చినప్పటికి ఆర్.ఆర్.ఆర్ ని అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడం ఖాయమని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.